NDTV on Adani | తమ సంస్థలో వాటాలు టేకోవర్ చేసుకోవడానికి అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలకు సెబీ ఆమోదం అవసరం అని ఎన్డీటీవీ గ్రూప్ తెలిపింది. రెండేండ్ల పాటు తమ సంస్థ ప్రమోటర్ల షేర్ల క్రయ, విక్రయాలపై 2020 నవంబర్లో నిషేధం విధించిందని గుర్తు చేసింది. ఈ తరుణంలో తమ నెట్వర్క్ గ్రూప్ను టేకోవర్ చేయడానికి అదానీ గ్రూప్కు సెబీ ఆమోదం పొందాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ గడువు వచ్చే నవంబర్ 26తో ముగుస్తుందని వివరించింది. ఈ వివరాలన్నీ విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీపీఎల్)కు అందజేశామని పేర్కొంది.
ఇంతకుముందు వీసీపీఎల్ను పూర్తిగా అదానీ గ్రూప్ అనుబంధ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ టేకోవర్ చేసింది. దీంతో ఎన్డీటీవీ ప్రమోటర్స్ గ్రూప్ ఆర్ఆర్పీఆర్లో వీసీపీఎల్కు కేటాయించిన 99.5 శాతం (ఎన్డీటీవీలో 29.18 శాతం) వాటాపై అదానీ గ్రూప్ హక్కులు క్లయిమ్ చేసింది. అయితే, ప్రమోటర్ల గ్రూప్ ఆర్ఆర్పీఆర్లో ప్రధాన వాటాదారులు ప్రణయ్రాయ్, రాధికారాయ్ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సెక్యూరిటీల క్రయ విక్రయాల్లో పాల్గొనవద్దని సెబీ ఆదేశించింది.
ఓపెన్ ఆఫర్ ద్వారా వీసీపీఎల్ తన వాటాలు విక్రయించినా.. సెబీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ నెల 23న ఎన్డీటీవీలో 29.18 శాతం వాటా టేకోవర్ చేశామని, ఓపెన్ ఆఫర్ ద్వారా మరో 26 శాతం కొంటామని అదానీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.