హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.32,500 కోట్ల టర్నోవర్ను సాధించినట్టు కంపెనీ సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించారు. రికార్డు స్థాయి టర్నోవర్ సాధించినందుకుగాను కార్మికులు, ఉద్యోగులను ఈ సందర్భంగా అభినందించారు. అటు ఉత్పత్తిలోనూ సంస్థ రికార్డు నెలకొల్పింది. 2022-23లో 671 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అంతక్రితం ఏడాది సాధించిన 650 లక్షల టన్నులతో పోలిస్తే 3.25 శాతం అధికమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఓవర్బర్డెన్ తొలగింపులోనూ 418 మిలియన్ క్యూబిక్ మీటర్లను తొలగించి రికార్డు సృష్టించింది. 2017-18లో 392 మిలియన్ క్యూబిక్ మీటర్ల తొలగింపే ఇప్పటి వరకు రికార్డు. దీనితో పోల్చితే ఈయేడు 7 శాతం అదనంగా ఓవర్బర్డెన్ను తొలగించారు. దీనితోపాటు బొగ్గు రవాణాలో గతేడాది కంటే 2 శాతం వృద్ధితో 667 లక్షల టన్నులు సాధించింది.
నిజానికి ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన నాల్గు దశాబ్దాల్లోనే ఎప్పుడూ నమోదుకానంత భారీ వర్షాలు కురిశాయి. దీనితో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినప్పటికీ.. కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో అత్యుత్తమ ఫలితాలను సాధించారని ఎన్ శ్రీధర్ పేర్కొన్నారు. ఇదే ఒరవడితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో నిర్దేశించుకున్న 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేరుకునేందుకు కృషి చేయాలని ఉద్యోగులకు సూచించారు.