హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో 750 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని నిర్దేశించుకున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఒడిశాలోని నైనీ, కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓపెన్ కాస్ట్ నుంచి కనీసం 80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగవచ్చని, తద్వారా ఈసారితో పోల్చితే 12 శాతం వృద్ధితో లక్ష్యాన్ని చేరుకోవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గురువారం సింగరేణి భవన్లో డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలతో బొగ్గు ఉత్పత్తి, రవాణాపై సీఎండీ శ్రీధర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో, ముఖ్యంగా గడిచిన రెండు నెలల్లో గరిష్ఠ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగడం సంతోషకరమన్నారు. అయితే ఇకపై రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిగేలా అన్ని ఏరియాల జీఎంలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎండీ ఆదేశించారు. ఇదే స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా వర్షాకాలం ప్రారంభం వరకు కొనసాగించాలని, అప్పుడే లక్ష్య సాధన సులువవుతుందని చెప్పారు. ప్రస్తుతం రోజూ 2.21 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని, అదనంగా మరో 9 వేల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలిగితే.. వార్షిక లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. ఇక రానున్న కాలంలో చేపట్టే ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి అన్ని రకాల టెండర్లు, తదితర ప్రక్రియలన్నీ 3 నెలల ముందుగానే పూర్తి చేయాలని డైరెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలన్నారు.