హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ):బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డు సృష్టించింది. కంపెనీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2021-22లో 650 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించింది. దీనితోపాటు రూ. 26 వేల కోట్ల టర్నోవర్ సాధించి మరో రికార్డును నెలకొల్పింది. రికార్డు స్థాయిలో ఉత్పత్తి, టర్నోవర్ సాధించిన నేపథ్యంలో సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ సింగరేణీయులకు, అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఇదే ఒరవడితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
గణనీయమైన వృద్ధి..
2020-21తో పోల్చితే.. 2021-22 లో సింగరేణి గణనీయమైన వృద్ధిని సాధించింది. 2020-21లో 505 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా.. 2022-23లో 28.6 శాతం వృద్ధితో 650 లక్షల టన్నులకు చేరుకున్నది. అలాగే బొగ్గు రవాణాలో 35 శాతం వృద్ధిని, ఓవర్ బర్డెన్ తొలగింపులో 20.4 శాతం వృద్ధిని సాధించింది. దీనితోపాటు సింగరేని చరిత్రలోనే అత్యధికంగా రూ. 26 వేల కోట్ల టర్నోవర్ను సాధించింది. 2020-21లో రూ. 17,669 కోట్ల టర్నోవర్ కన్నా.. ఈయేడు 47 శాతం అధికం. ఉక్రెయిన్-రష్యా యుద్ధ సంక్షోభంతో కంపెనీ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడింది. నిజానికి 680 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా.. పేలుడు పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్గా ఎస్టీపీపీ
2021-22 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం (ఎస్టీపీపీ) 9353 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇందులో 8808 మిలియన్ యూనిట్లను తెలంగాణ రాష్ట్ర గ్రిడ్కు సరఫరా చేసింది. ఈయేడు దేశ వ్యాప్తంగా స్టేట్ సెక్టార్లో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యుత్తమ పీఎల్ఎఫ్ సాధించి అగ్ర స్థానంలో నిలిచింది. మరోవైపు, సింగరేణి పరిధిలో నెలకొల్పిన 219 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్తో రూ.130 కోట్ల మేర విద్యుత్ బిల్లు ఆదా అయిందని పేర్కొంది.
తెలంగాణకు 127.9 లక్షల టన్నుల బొగ్గు..
సింగరేణి ఉత్పత్తి చేసిన 650 లక్షల టన్నుల బొగ్గులో.. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలకు 127.9 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసింది. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలతోపాటు సిమెంట్, సిరామిక్స్, పేపర్, స్పాంజ్ ఐరన్ వంటి పరిశ్రమలన్నింటికీ సింగరేణి బొగ్గును సరఫరా చేసింది.