న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో రూ.1.65 లక్షల కోట్ల విలువైన రుణాలను రద్దు చేసింది. ఈ విషయంలో మరో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.59,807 కోట్లతో తర్వాతి స్థానంలో ఉన్నది. ఈ మేరకు సోమవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
2018-19 నుంచి 2021-22 వరకు మొత్తం రూ.1,65,335 కోట్ల రుణాలను ఎస్బీఐ రద్దు చేసినట్టు సభకు సమర్పించిన గణాంకాల్లో మంత్రి తెలియజేశారు. అయితే వీటిలో ఎక్కువగా కార్పొరేట్ రుణాలే ఉండటం గమనార్హం. దీంతో పేద, మధ్యతరగతి వర్గాలు, రైతులు తీసుకున్న రుణాల వసూళ్లలో కఠినంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు.. కార్పొరేట్లపై ఇంత ఉదాసీనతను ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి.