ముంబై, జనవరి 25: కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న బీమా పథకాల్లో అనుమతి లేకుండా కస్టమర్లను చేర్చుకోవడంపై తమ ఉద్యోగులను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హెచ్చరించింది. విజిల్-బ్లోయర్ పాలసీ కింద బ్యాంక్కు ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు ఓ సంస్థాగత లేఖను ఎస్బీఐ విడుదల చేసినట్టు తెలుస్తున్నది.
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) వంటి పాలసీల కోసం కస్టమర్లకు చెప్పకుండానే, వారి నుంచి ఎటువంటి అంగీకారం లేకుండానే ఖాతాల నుంచి ప్రీమియంలను కట్ చేస్తున్నారని బ్యాంక్కు తెలియవచ్చింది.
దీన్ని తీవ్రంగా పరిగణించిన బ్యాంక్.. ఇటువంటి చర్యలకు బాధ్యులైనవారిపై కఠినంగా ప్రవర్తిస్తామని హెచ్చరించింది. ఇందుకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు పై అధికారులకు అందితే వెంటనే స్పందించాలని కూడా సూచించింది. కాగా, ప్రాంతీయ వ్యాపార కార్యాలయాల్లో (ఆర్బీవో) ఉన్న అధికారులే ఇలా చేస్తున్నారని అంటున్నారు.