న్యూఢిల్లీ : ప్రస్తుత వృద్ధి రేటు కొనసాగితే 2027 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరిస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ (SBI Research Report) అంచనా వేసింది. ఈ ప్రక్రియలో జపాన్, జర్మనీలను భారత్ అధిగమిస్తుందని తన ఎకోరాప్ నివేదికలో స్పష్టం చేసింది. అంతకుముందు భారత్ 2029 నాటికి మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరిస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొనగా లేటెస్ట్ రిపోర్ట్లో రెండేండ్ల ముందుగానే భారత్ ఈ మైలురాయికి చేరుకుంటుందని అంచనా వేసింది.
2022 నుంచి 2027 మధ్య భారత్ ఆర్ధిక వ్యవస్ధ ఏకంగా ఆస్ట్రేలియా ఆర్ధిక వ్యవస్ధ పరిమాణం కంటే అధికంగా ఎదుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. భారత్ ఇదే తరహా వృద్ధి జోరును కొనసాగిస్తే ఏటా 0.75 ట్రిలియన్ డాలర్ల పెరుగుదల నమోదు చేస్తూ 2047 నాటికి 20 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరుకుంటుందని ఈ రిపోర్ట్ అంచనా వేసింది. 2027 నాటికి ప్రపంచ జీడీపీలో భారత వాటా 4 శాతం దాటుతుందని పేర్కొంది.
ప్రస్తుతం గ్లోబల్ జీడీపీలో భారత్ వాటా 3.5 శాతంగా నమోదవుతోంది. భారత్ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధల్లో మూడవ స్ధానానికి చేరుకునే సమయానికి అంటే 2027 నాటికి మహారాష్ట్ర, యూపీ 500 బిలియన్ డాలర్ల మార్క్ను అధిగమిస్తాయని అంచనా వేసింది. 2027లో భారత్లో కీలక రాష్ట్రాల జీడీపీ పరిమాణం వియత్నాం, నార్వే వంటి దేశాల జీడీపీ కంటే అధికంగా ఉంటుందని పేర్కొంది.
Read More :