న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత రద్దీ సముద్ర మార్గమైన సుయాజ్ కాల్వను బ్లాక్ చేసిన భారీ కార్గో నౌక ‘ఎవర్ గివెన్’లోని సిబ్బంది అంతా భారతీయులేనని ఆ ఓడను నిర్వహిస్తున్న ఎవర్ గ్రీన్ సంస్థ తెలిపింది. మొత్తం 25 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది. నౌకకు మార్గ నిర్దేశం చేసే ఈజిప్ట్ కెనాల్ అథారిటీకి చెందిన ఇద్దరు పైలట్లు కూడా ఓడపై ఉన్నట్లు వెల్లడించింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే ఇది చాలా కష్టమైన పని అని సంస్థ యాజమాని షోయి కిసెన్ కైషా తెలిపారు.
కాగా, ఇసుక తుఫాన్, భారీ గాలుల కారణంగా ఎవర్ గివెన్ నౌక మంగళవారం సూయజ్ కాల్వలో అడ్డంగా చిక్కుకున్నది. దీంతోఅత్యంత రద్దీ అయిన ఆ సముద్ర మార్గం ఇరువైపులా సుమారు 150 నౌకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కార్గో షిప్పింగ్ సంస్థలు రోజుకు కోట్లలో నష్టపోతున్నాయి.