SBI Positive Pay | వివిధ బ్యాంకుల ఖాతాదారుల చెల్లింపుల్లో పాజిటివ్ పే విధానాన్ని అమల్లోకి తేవాలని ఆర్బీఐ నిర్ణయించింది. ప్రత్యేకించి సేవింగ్స్ ఖాతాదారులు రూ.5 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తాలు చెక్ ద్వారా చెల్లించినప్పుడు మోసాలను అరికట్టేందుకు ఈ పాలసీ తీసుకొచ్చింది. అందులో భాగంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) కూడా చెక్ పేమెంట్స్లో పాజిటివ్ పేమెంట్ విధానం అమల్లోకి తెస్తున్నది.
పాజిటివ్ పే సిస్టమ్ ప్రకారం చెక్ ద్వారా నగదు విత్ డ్రాయల్కు సంబంధిత ఖాతాదారు నుంచి పునః ధృవీకరణ (Reconfirms) తీసుకుంటుంది. అందుకోసం చెక్ ఆపరేటెడ్ అకౌంట్ హోల్డర్లు తప్పనిసరిగా పాజిటివ్ పేమెంట్ విధానం కింద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో వారి శాఖల్లో అప్లికేషన్లు సమర్పించాలని ఎస్బీఐ తెలిపింది.
పాజిటివ్ పేమెంట్స్ విధానం కింద నేరుగా బ్యాంకు శాఖకు వెళ్లడంతోపాటు ఇతర చానెల్స్లోనూ తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ (యోనోలైట్ YonoLite ). రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ( Retail Internet Banking ), కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ( Corporate Internet Banking ), యోనో ( YONO ) యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయొచ్చు.
సేవింగ్స్ ఖాతాదారులకు సంబంధించి రూ.5 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం, కరంట్ ఖాతాదారులు రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తాల చెల్లింపులకు పాజిటివ్ పేమెంట్ వ్యవస్థ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో తమ ఖాతా పరిమితిని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఎస్బీఐ వెబ్సైట్ తెలిపింది. చెక్ను జారీ చేసిన ఖాతాదారులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం తదితర చానెల్స్లో బ్యాంకుకు కనీస సమాచారం తెలియ చేయాలి.
ఆ చెక్ జారీ చేసిన తేదీ, దాని లబ్ధి దారుడి పేరు, పే చేస్తున్న మొత్తం సమాచారం అందచేయాలి. చెక్ జారీ చేసిన వ్యక్తి వివరాలు కూడా తెలపాలి. సంబంధిత చెక్ పొందిన వ్యక్తి డిపాజిట్ చేసినప్పుడు అందులో వివరాలు సరిపోలితేనే నగదు విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకు అధికారులు అనుమతి ఇస్తారు. లేని పక్షంలో తిరస్కరిస్తారు. ఈ ప్రాసెస్ను భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ- NPCI) డెవలప్ చేసింది.