ఫార్చూన్ గ్లోబల్ 2021 జాబితా
న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశంలో అత్యంత శ్రీమంతుడైన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) స్థానం ఫార్చూన్ గ్లోబల్-500 జాబితాలో 55 మెట్లు తగ్గింది. ఆదాయం ప్రకారం ఆయా కంపెనీల పరిమాణాన్ని తెలియపర్చే ఈ 2021 ఫార్చూన్ గ్లోబల్ జాబితా సోమవారం విడుదలయ్యింది. ఈ జాబితాలో ఆర్ఐఎల్ 155వ స్థానంలో నిలిచింది. 2017 తర్వాత ఈ కంపెనీకి ఇంతటి తక్కువ ర్యాంకింగ్ దక్కడం ఇదే ప్రధమం. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 16 స్థానాల్ని మెరుగుపర్చుకుని 205వ స్థానాన్ని సాధించింది. కాగా తాజా ఫార్చూన్ జాబితాలో 524 బిలియన్ డాలర్ల ఆదాయంతో వాల్మార్ట్ అగ్రస్థానాన్ని ఆక్రమిస్తుండగా, చైనాకు చెందిన స్టేట్ గ్రిడ్ 384 బిలియన్ డాలర్లతో ద్వితీయస్థానంలోనూ, 280 బిలియన్ డాలర్ల ఆదాయంతో అమెజాన్ తృతీయస్థానంలోనూ ఉన్నాయి. చైనాకు చెందిన నేషనల్ పెట్రోలియం, సినోపెక్ గ్రూప్లు 4,5 స్థానాల్లో ఉన్నాయి. కాగా రిలయన్స్ ఆదాయం 25.3 శాతం క్షీణించి 63 బిలియన్ డాలర్లకు చేరింది. ఎస్బీఐ ఆదా యం 52 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ జాబితాలో ఎస్బీఐ వరుసగా రెండో ఏడాది తన స్థానాన్ని పెంచుకుంది. ఐవోసీ 50 బిలియన్ డాలర్ల ఆదాయంతో 61 స్థానాల్ని కోల్పోయి 212 స్థానానికి తగ్గగా, ఓఎన్జీసీ 46 బిలియన్ డాలర్ల ఆదాయంతో 53 మెట్లు దిగి, 243వ స్థానానికి చేరింది.