Adani Group | (స్సెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ):తమవద్ద ఉన్నది సామాన్యుల సొమ్ము అన్న సోయి కూడా లేకుండా అదానీ కంపెనీల్లో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్ఐసీ వంటి బీమా సంస్థలు ఇప్పటికే నష్టపోయి మూకుమ్మడిగా మూతులు కాల్చుకొన్నాయి. అయినప్పటికీ, ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్న అదానీ గ్రూప్నకు వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియమ్ మళ్లీ సిద్ధమైంది. తాజా నిర్ణయంతో సామాన్యుల కష్టార్జితం మళ్లీ ప్రమాదంలో పడుతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సామాన్యుల కష్టార్జితాన్ని కాపాడుతూ ఆర్థిక భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వ రంగ బ్యాంకులు తీసుకొంటున్న అనాలోచిత నిర్ణయాలు ప్రజల సొమ్మును ప్రమాదంలో పడేలా చేస్తున్నాయి. నిధులు లేక సతమతమవుతున్న అదానీ గ్రూపునకు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఎప్పుడూ అండగా నిలుస్తున్నది. తాజాగా గుజరాత్లోని ముంద్రాలో అదానీ గ్రూపు రూ.34 వేల కోట్లతో నిర్మించతలపెట్టిన పాలీవినీల్ క్లోరైడ్ (పీవీసీ) ప్రాజెక్టుకు రుణం ఇవ్వడానికి సిద్ధమైంది. హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పనులకు తాత్కాలికంగా బ్రేక్ వేసినప్పటికీ మళ్లీ పనులు ప్రారంభించింది సంస్థ. 2025లో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ అతిపెద్ద ప్రాజెక్టుకు ఎస్బీఐ బ్యాంకింగ్ కన్సార్టియమ్ రూ. 14,500 కోట్లను రుణంగా మంజూరు చేయనున్నట్టు జాతీయ ఆంగ్ల పత్రిక ‘ది హిందూ బిజినెస్ లైన్’ ఓ కథనంలో ప్రచురించింది. మిగతా రుణం ఇతర ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు ఇవ్వబోతున్నాయి. అదానీ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ‘హిండెన్బర్గ్’ ఆరోపణలు చేసిన తర్వాత కూడా ఆ గ్రూప్ కంపెనీలో ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకింగ్ కన్సార్టియం వేల కోట్ల రుణాలు ఇవ్వడం విమర్శలకు దారితీస్తున్నది. ఇక హిండెన్బర్గ్ రిపోర్టు తర్వాత అదానీ కంపెనీలో పీఎస్యూలు ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. అదానీ కంపెనీల కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్ఐసీ ఇప్పటికే వేల కోట్ల రూపాయల సంపదను కోల్పోయాయి. అయితే గతాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మళ్లీ అదే గ్రూప్ కంపెనీకి ఎస్బీఐ కన్సార్టియం రుణాలు మంజూరు చేస్తుండటం గమనార్హం.
ఎల్ఐసీ నష్టాలు అలా..
హిండెన్బర్గ్ నివేదిక వెలువడక ముందువరకూ అదానీ కంపెనీల్లో ఎల్ఐసీకి ఉన్న పెట్టుబడుల విలువ రూ.87,380 కోట్లుగా ఉండేది. ప్రభుత్వ రంగ పోటీ సంస్థలైన సిటిగ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఇంద్రప్రస్థ గ్యాస్, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మీటర్ పవర్గ్రిడ్ షేర్లు తక్కువకే లభించినప్పటికీ, ఎల్ఐసీ అదానీ గ్రూప్లో షేర్లు కొనడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, హిండెన్బర్గ్ దెబ్బకు అదానీ షేర్లు పేకమేడల్లా పడిపోయాయి. దీంతో ఎల్ఐసీ సంపద దాదాపు రూ.50 వేల కోట్లు తరిగిపోయింది. అలా అదానీ గ్రూప్ కారణంగా ఎల్ఐసీ తీవ్ర నష్టాలను చవిచూసింది. ఇక, 2017లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గెయిల్ లిమిటెడ్లు ఒడిశాలోని ధమ్రా పోర్ట్లో రూ.6 వేల కోట్ల విలువైన సహజవాయు టర్మినల్లో 49 శాతం వాటా కోసం పెట్టుబడులు పెట్టాయి. రూ.750 కోట్లతో ఇండియన్ ఆయిల్ పెట్టుబడులు పెట్టింది. తద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోయిన అదానీ గ్రూప్నకు వివిధ కంపెనీల నుంచి రుణాలు పుట్టేలా సాయపడింది. అయితే అదానీ షేర్ల విలువ పడిపోవడంతో కంపెనీలు నష్టాలు చవిచూశాయి.