న్యూఢిల్లీ, జూలై 16: విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో బ్యాంకులకు శుక్రవారం మరో రూ.792 కోట్లు అందాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకర్ల కూటమికి రూ.792.11 కోట్లను అందజేశామని పేర్కొన్నది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద గతంలో జప్తు చేసిన షేర్లలో కొన్ని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ షేర్లను అమ్మిన తర్వాత ఈ మొత్తాన్ని బ్యాంకుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించింది. కాగా, ఇటు మాల్యా, అటు నీరవ్-చోక్సీల మోసాల్లో బ్యాంకులకు వాటిల్లిన నష్టాల్లో (రూ.22,585.83 కోట్లు) ఇప్పటిదాకా 58 శాతం రికవరీ అయ్యిందని ఈడీ ఈ సందర్భంగా ప్రకటించింది. గత నెలలోనూ మాల్యా కేసులో బ్యాంకులకు రూ.7,181 కోట్లకుపైగా ముట్టినది తెలిసిందే.