న్యూఢిల్లీ, డిసెంబర్ 2: రైతులకు సహరుణాలిచ్చేందుకు ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, అదాని గ్రూప్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) అదాని క్యాపిటల్లు చేతులు కలిపాయి. ఈ మేరకు ఇరు సంస్థలు కో లెండింగ్ మాస్టర్ అగ్రిమెంట్పై సంతకాలు చేసినట్లు గురువారం ఎస్బీఐ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. తమ భాగస్వామ్యం… దేశంలో పంటల దిగుబడిని పెంచడానికి అవసరమయ్యే వ్యవసాయ యాంత్రీకరణను మెరుగుపరుస్తుందని, ట్రాక్టర్లను, వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసేందుకు రైతులకు రుణాలిస్తామని బ్యాంక్ పేర్కొంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం రైతు ఖాతాదారులకు ఈ భాగస్వామ్యంతో రుణాలందుతాయన్నది. వ్యవసాయ యాంత్రీకరణకు రుణాలివ్వడానికి, గోదాముల రిసీట్ ఫైనాన్స్ చేసేందుకు, వ్యవసాయ సంఘాలకు ఆర్థిక సహకారం అందించడానికి పలు ఎన్బీఎఫ్సీలతో కలసి కో-లెండింగ్ అవకాశాల కోసం చూస్తున్నామని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతుల దిగుబడి, రాబడిని పెంచడం తమ కంపెనీ లక్ష్యమని అదాని క్యాపిటల్ ఎండీ గౌరవ్ గుప్తా చెప్పారు.
వ్యవస్థలో రుణ సేవలు అందని వారికి, తక్కువ లభిస్తున్నవారికి కో-లెండింగ్ స్కీమ్ల ద్వారా ప్రాధాన్యతా రంగ రుణాల్ని మంజూరు చేసేందుకు బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలకు 2018లో ఆర్బీఐ మార్గదర్శకాల్ని జారీచేసింది. ఈ రుణంలో 80 శాతం బ్యాంక్, 20 శాతం ఎన్బీఎఫ్సీ ఇస్తుంది.