న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు సవరించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను పెంచిన బ్యాంక్..బేస్ రేటుని కూడా 15 బేసిస్ పాయింట్లు సవరించింది. పెరిగిన వడ్డీరేట్లు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో బేస్రేటు 10.10 శాతం నుంచి 10.25 శాతానికి చేరుకోగా, పలు రకాల కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ 8 శాతం నుంచి 8.85 శాతం మధ్యలోకి చేరుకున్నాయి. ఒక్కరోజు కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ని యథాతథంగా ఉంచిన బ్యాంక్..మిగతా రుణాలపై రేటును 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. అలాగే బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రేటుని సైతం 9.5 శాతం+సీఆర్పీ+బీఎస్పీ, ఆర్ఎల్ఎల్ఆర్ని 8.75 శాతం+సీఆర్పీగా నిర్ణయించింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు మరింత పెరగనున్నాయి. రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ బ్యాంకులు మాత్రం వడ్డీరేట్లను క్రమంగా పెంచుతున్నాయి.