SBI | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటు మరింత అధికంకానున్నది. రిజర్వు బ్యాంక్ రెపోరేటును పావు శాతం పెంచిన వారం రోజుల తర్వాత ఎస్బీఐ వడ్డీరేట్లను పెంచడం విశేషం. బ్యాంక్ వెబ్సైట్లో ఉన్న సమాచారం మేరకు ఒక్కరోజు రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు సవరించడంతో రుణ రేటు 7.85 శాతం నుంచి 7.95 శాతానికి చేరుకున్నది. దీంతోపాటు నెల, మూడు, ఆరు నెలలు, ఏడాది, రెండేండ్ల రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు సవరించింది. పెరిగిన వడ్డీరేట్లు వెంటనే అమలులోకి వచ్చాయని బ్యాంక్ పేర్కొంది. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు తమ రుణాలపై వడ్డీరేట్లను పెంచిన విషయం తెలిసిందే.
రుణాలపై వడ్డీరేట్లను పెంచిన ఎస్బీఐ మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను కూడా సవరించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్ల నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతోపాటు బ్యాంక్ 400 రోజుల కాలపరిమితి కలిగిన ప్రత్యేక డిపాజిట్ స్కీంను పరిచయం చేసింది. వచ్చే నెల 31 వరకు అమలులో ఉండనున్న ఈ స్కీంపై 7.10 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు అధికంగా వడ్డీని చెల్లించనున్నది. రెండేండ్ల నుంచి మూడేండ్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేటును 6.75 శాతం నుంచి 7 శాతానికి, మూడేండ్ల నుంచి 10 ఏండ్ల లోపు డిపాజిట్లపై వడ్డీని మరో పావు శాతం సవరించింది. ఏడాది నుంచి రెండేండ్ల లోపు డిపాజిట్లపై వడ్డీని 5 బేసిస్ పాయింట్లు పెంచింది.