ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) స్కీంలో రూ.15 లక్షలకుపైగా డిపాజిట్ చేయాలనుకుంటున్నారా?.. అయితే మీ కోసం ఎస్బీఐ.. సర్వోత్తం టర్మ్ డిపాజిట్ పేరిట ఓ ఆకర్షణీయ స్కీంను తీసుకొచ్చింది. ఈ పథకం కింద పీపీఎఫ్, ఎన్ఎస్సీ తదితర పోస్టాఫీస్ డిపాజిట్ స్కీంల కంటే ఎక్కువ వడ్డీరేటును డిపాజిట్దారులు పొందవచ్చు.
7.9 శాతం వడ్డీ..
రెండేండ్ల డిపాజిట్పై సీనియర్ సిటిజన్లు 7.9 శాతం, సాధారణ పౌరులు 7.4 శాతం వడ్డీని అందుకోవచ్చు. ఇక ఏడాది కాలపరిమితి డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు 7.6 శాతం, ఇతరులు 7.1 శాతం వడ్డీరేటును తీసుకోవచ్చు. రెండేండ్ల సర్వోత్తం డిపాజిట్లలో రూ.15 లక్షలకుపైగా సొమ్ము పెడితే వార్షిక రాబడి 8.14 శాతం వస్తుంది. ఇక రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు బల్క్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ఏడాదికైతే 7.55 శాతం, రెండేండ్లకైతే 7.4 శాతం వడ్డీరేటు లభిస్తుంది. నిజానికి ఇటీవలే ఇతర రెగ్యులర్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లనూ సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ సవరించింది. రెండేండ్ల నుంచి మూడేండ్లలోపు, ఐదేండ్ల నుంచి పదేండ్ల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నది.
పీపీఎఫ్లో..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) డిపాజిట్లపై ప్రస్తుత వడ్డీరేటు 7.1 శాతం. ఏటా ఇందులో రూ.1.5 లక్షలు మాత్రమే మదుపు చేయవచ్చు. అయితే ఇతర ఎఫ్డీ స్కీంల కంటే పీపీఎఫ్ ఖాతాకు పన్ను ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి.
పోస్టాఫీస్ వడ్డీరేట్లు
ఐదేండ్ల పోస్టాఫీస్ టైం డిపాజిట్లపై 7 శాతం వడ్డీ వస్తుంది. ఏడాది, రెండేండ్ల డిపాజిట్లపై 6.6 శాతం, 6.8 శాతం చొప్పున వస్తున్నది. పోస్టాఫీస్ నెలసరి ఆదాయ ఖాతాలో 7.1 శాతం వడ్డీరేటు లభిస్తున్నది.
ఎన్ఎస్సీలో..
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) డిపాజిట్లలో ప్రస్తుత వార్షిక వడ్డీరేటు 7 శాతం. ఐదేండ్ల కోసం ఈ పథకంలో మదుపు చేసుకోవచ్చు. ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలనూ పొందవచ్చు.
కేవీపీ వడ్డీరేటు
కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) డిపాజిట్లపై ప్రస్తుత వార్షిక వడ్డీరేటు 7.2 శాతంగా ఉన్నది. 120 నెలల్లో ఈ స్కీంలోని పెట్టుబడి రెట్టింపు అవుతుంది.
సీనియర్ సిటిజన్లకు 8.20 శాతం గరిష్ఠ వడ్డీ
డిపాజిట్లను ఆకట్టుకోవడానికి బ్యాంకు లు, ఆర్థిక సేవల సంస్థలు తమ వడ్డీరేట్లను అమాంతం పెంచేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వరంగ బ్యాంకులు తమ డిపాజిట్లపై వడ్డీని పెంచగా..తాజాగా ఈ జాబితాలోకి బజాజ్ ఫైనాన్స్ చేరింది. 15 నెలలు, 23 నెలల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజా పెంపుతో సీనియర్ సిటిజన్లు 8.20 శాతం వడ్డీని పొందనున్నారు. 44 నెలల కాలపరిమితికి మాత్రమే ఈ పెంపు వర్తించనున్నదని పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో ఇస్తున్న అధిక వడ్డీల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం. అలాగే 60 ఏండ్ల లోపు డిపాజిట్లపై 7.95 శాతం వడ్డీని చెల్లిస్తున్నది. ఒకవైపు ద్రవ్యోల్బణం పుంజుకుంటుండటం, మరోవైపు నిధుల కొరత రాకుండేందుకే ఎఫ్డీలపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు బజాజ్ ఫైనాన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల సూర్యోద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు కూడా తమ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచాయి.