SBI Green Car Loan | కర్బన ఉద్గారాలను నియంత్రించాలన్న నినాదానికి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. ప్రత్యేకించి పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం ప్రజలు ముందుకు వస్తున్నారు. పరిస్థితులు ఇలాగే సాగితే ప్రభుత్వ లక్ష్యాల మేరకు వచ్చే ఎనిమిదేండ్లలో భారత్లో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలే తిరగనున్నాయి. విద్యుత్ వాహనాల కొనుగోలుకు ప్రోత్సహించేందుకు దేశంలోని బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయి. ఆకర్షణీయ రుణాలతో ప్రోత్సహిస్తున్నాయి.
దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) .. గ్రీన్ కార్ లోన్ పేరిట స్కీం అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకుని కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రజలను ప్రోత్సహించడానికి భారత్లోనే ఫస్ట్ గ్రీన్ కార్ లోన్ అంద చేస్తున్న ఎస్బీఐ, చార్జింగ్ ఇండియా`స్ గ్రీన్ ఫ్యూచర్ నినాదంతో ముందుకెళుతున్నట్లు ట్వీట్ చేసింది.
గ్రీన్ కారు రుణం కింద విద్యుత్ కార్లు కొనుగోలు చేసే వారికి 7.25 నుంచి 7.60 శాతం వడ్డీపై రుణాలు అందిస్తున్నది. ఈ నెల 15 నుంచి ఈ గ్రీన్ కార్ రుణ స్కీం అమల్లోకి వచ్చింది. కనిష్టంగా మూడేండ్లు.. గరిష్ఠంగా ఎనిమిదేండ్లలోపు రుణం చెల్లించాల్సి ఉంటుంది. 21 ఏండ్ల నుంచి 67 ఏండ్లలోపు వారి వరకు రుణం పొందొచ్చు. అన్ని క్యాటగిరీల కస్టమర్లకు సాధారణ కార్లపై రుణాలకంటే 20 బేసిక్ పాయింట్లు తక్కువ వడ్డీ అందిస్తున్నది. కారు ధరలో 90 శాతం రుణం మంజూరు చేస్తున్నది. మూడు క్యాటగిరీల్లో ఎస్బీఐ ఎలక్ట్రిక్ వెహికల్ రుణాలు ఆఫర్ చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (మహారత్న, నవరత్న, మినీ రత్న) పని చేసే ఉద్యోగులతోపాటు డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ (డీఎస్పీ), పారా మిలిటరీ శాలరీ ప్యాకేజీ (పీఎంఎస్పీ), ఇండియన్ కోస్టల్ గార్డ్ ప్యాకేజీ (ఐజీఎస్పీ)తోపాటు వివిధ రక్షణ రంగ విభాగాల్లోని కస్టమర్లు, షార్ట్ కమిషన్డ్ ఆఫీసర్లను తొలి క్యాటగిరీలోకి తీసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కనీస వేతనం రూ.3 లక్షలు. నెలవారీ వేతనంపై 48 రెట్లు బ్యాంకు రుణం లభిస్తుంది.
రెండో క్యాటగిరీలో నిఫుణులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, వ్యాపారవేత్తలు, ఆదాయం పన్ను చెల్లిస్తున్న ఆస్తులు లేదా భాగస్వామ్య సంస్థలు వస్తారు. ఏడాదిలో నికర లాభం లేదా స్థూల పన్ను ఆదాయం రూ.3 లక్షలు ఉండాలి. వార్షిక నికర లాభంపై నాలుగు రెట్లు గరిష్టంగా రుణం ఇస్తారు. ఇప్పటికే తీసుకున్న రుణాల చెల్లింపును పరిగణనలోకి తీసుకుంటారు.
వ్యవసాయం, దాని అనుబంధ వృత్తుల్లో పని చేస్తున్న వ్యక్తులను మూడో క్యాటగిరీగా విభజించారు. వీరి ఆదాయం కనీసం వార్షికంగా రూ.4 లక్షలు ఉండాలి. నికర వార్షిక ఆదాయంపై గరిష్టంగా మూడు రెట్లు రుణం మంజూరు చేస్తారు.