న్యూఢిల్లీ, జనవరి 19: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి రూ.974 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కరోనా విలయం నేపథ్యంలో 2020లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రుణగ్రహీతలకు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మారటోరియం వెసులుబాటును కల్పించగా, దీనికి సంబంధించి రీయింబర్స్మెంట్గానే ఎస్బీఐకి రూ.973.74 కోట్లను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 6 నెలల మారటోరియం సమయంలో సాధారణ వడ్డీ, చక్రవడ్డీ భారం రుణగ్రహీతలపై పడకుండా తెచ్చిన ఎక్స్గ్రేషియా పేమెంట్ స్కీం కింద గత బడ్జెట్లో రూ.5,500 కోట్లు కేటాయించామని క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.
ఐఆర్ఈడీఏలోకి రూ.1,500 కోట్లు
భారతీయ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (ఐఆర్ఈడీఏ)లో అదనంగా రూ.1,500 కోట్ల ఈక్విటీని ఇచ్చేందుకు ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ అంగీకరించింది. దీంతో పునరుత్పాదక శక్తి రంగానికి సంస్థ నుంచి దక్కే రుణాల సామర్థ్యం మరో రూ.12,000 కోట్లు పెరగనున్నది.