Samsung | గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ వైస్చైర్మన్ జయ్ వై.లీ తిరిగి సంస్థ బోర్డులో చేరేందుకు రంగం సిద్ధమైంది. రెండు శాంసంగ్ సంస్థల విలీనం విషయమై ప్రభుత్వ మద్దతు పొందడానికి ముడుపులు చెల్లించారన్న అభియోగంపై జయ్ వై లీని దక్షిణ కొరియా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 18 నెలలు జైలు జీవితం గడిపిన జయ్ వై లీ.. ఏడాది క్రితం పెరోల్పై విడుదల అయ్యారు. ఆయన ఏడాది క్రితం పొందిన పెరోల్కు దక్షిణ కొరియా సర్కార్ షరతులు విధించింది. ఐదేండ్లు ఉద్యోగ బాధ్యతలు చేపట్టరాదని, బోర్డుకు హాజరు కాకుండా కంపెనీ ఎగ్జిక్యూటివ్లు సమర్పించే నివేదికలను మాత్రమే తీసుకోవాలని పేర్కొంది. ఆయనకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రత్యేకంగా క్షమాబిక్ష ప్రసాదించనున్నారు. ఈ నెల 15న దేశ స్వాతంత్య్ర వార్షికోత్సవం సందర్భంగా యూన్ సుక్ యోల్ ఈ క్షమాభిక్ష ప్రకటన చేస్తారు.
తొలుత జయ్ వై లీకి 30 నెలల జైలుశిక్ష విధించారు. అయితే, ఆయన అరెస్ట్కు కారణమైన దేశాధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై సర్కార్ తదుపరి కుప్పకూలింది. జయ్ వై.లీకి ప్రభుత్వ క్షమాభిక్ష లభించడంతో శాంసంగ్ బోర్డులో చేరేందుకు.. వివిధ సంస్థలు, దేశాలతో వాణిజ్య ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభిస్తుంది.
కరోనా తర్వాత లాప్టాప్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు, సెల్ఫోన్లకు గిరాకీ పెరిగింది. దీనికితోడు కరోనా టైంలో లాక్డౌన్ వల్ల వీటిల్లో వినియోగించే సెమీ కండక్టర్ల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ ప్రభావం ఇప్పటికీ ఆటోమొబైల్, టెక్నాలజీ రంగాలను వెంటాడుతున్నది. క్షమాభిక్ష లభిస్తే సెమీ కండక్టర్ల తయారీ సంస్థల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి శాంసంగ్ బోర్డుకు జయ్ వై లీ సారధ్యం వహిస్తారు. 2020 అక్టోబర్లో శ్యామ్సంగ్ చైర్మన్, జయ్ వై.లీ తండ్రి లీకున్-హీ మరణం తర్వాత ఆ పోస్ట్ ఖాళీగా ఉంది.