సియోల్, జూలై 27: భారత్లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ఫోన్లను తయారు చేస్తామని సామ్సంగ్ నైరుతి ఆసియా అధ్యక్షుడు, సీఈవో జేబీ పార్క్ ప్రకటించారు. నోయిడాలోగల ఫ్యాక్టరీలో వీటి మాన్యుఫ్యాక్చర్ జరుగుతుందని చెప్పారు. బుధవారం ఇక్కడ ఈ ప్రీమియం మొబైల్స్ను సామ్సంగ్ మార్కెట్కు పరిచయం చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు గెలాక్సీ వాచ్ 6 సిరీస్, గెలాక్సీ ట్యాబ్ 9 సిరీస్లనూ ఆవిష్కరించారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నుంచి భారత్లో ఫోల్డ్ 5, ఫ్లిప్ 5 మొబైల్స్ ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయని పార్క్ వెల్లడించారు. ఆగస్టు 18 నుంచి భారత్లో అమ్మకాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అయితే వచ్చే నెల 11నే దక్షిణ కొరియాలో అమ్మకాలు మొదలు కానున్నాయి. ఇదిలావుంటే అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ మొబైల్స్లో జెడ్ ఫోల్డ్ 5 ప్రారంభ ధర భారత్లో రూ.1,54,999గా, ఫ్లిప్ 5 ఆరంభ ధర రూ.99,999గా ఉన్నది. 256జీబి నుంచి 1టీబీ వరకు సామర్థ్యం కలిగిన ఈ మొబైల్స్లో ఫోల్డ్ 5 స్క్రీన్ 7.6 అంగుళాలు, ఫ్లిప్ 5 స్క్రీన్ 6.7 అంగుళాలుగా ఉన్నది. కెమెరాలు 50 మెగాపిక్సల్దాకా ఉన్నాయి.