Samsung : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (Samsung Electronics) అమెరికా (USA) లో తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. న్యూజెర్సీ (New Jersey) లోని తన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా (ఎస్ఈఏ) ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్కు తరలించడంతో పాటు, పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతను ప్రకటించింది. ఈ మార్పుల వల్ల వందలాది మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ప్రధాన కార్యాలయాన్ని న్యూజెర్సీలోని ఎంగిల్వుడ్ క్లిఫ్స్ నుంచి టెక్సాస్లోని ప్లానోకు తరలించే ప్రక్రియలో భాగంగా 739 ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని శాంసంగ్ ధృవీకరించింది.
వీరిలో ఎక్కువ మందికి టెక్సాస్కు మారేందుకు అవకాశం కల్పించగా.. ఆసక్తి చూపని వారిని విధుల నుంచి తొలగించారు. దీనికి అదనంగా టెక్సాస్లోని ప్లానో కార్యాలయంలో మొబైల్ విభాగంతో సహా సుమారు 100 మంది ఉద్యోగులను కూడా తొలగించినట్లు కంపెనీ అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైంది. జూన్ 30న సంస్థ వ్యాప్తంగా ఉద్యోగాల కోత ఉంటుందని ఉద్యోగులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా 30 మందికి పైగా సీనియర్ సేల్స్, మార్కెటింగ్ సిబ్బంది తాము కంపెనీని వీడుతున్నట్లు లింక్డ్ఇన్లో పోస్టులు పెట్టారు.
ఈ మార్పులపై శాంసంగ్ స్పందిస్తూ.. ‘వివిధ బృందాలను ఒకేచోటికి తీసుకురావడం ద్వారా సంస్థాగత సామర్థ్యాన్ని పెంచేందుకు, మెరుగైన సహకార వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ఏఐ ఎకోసిస్టమ్లో భాగం కావాలనే లక్ష్యంతోనే టెక్సాస్కు మారుతున్నాం’ అని వివరించింది. ఇది ప్రపంచవ్యాప్త పునర్వ్యవస్థీకరణ కాదని, కేవలం అమెరికాలోని కార్యకలాపాలను ప్రస్తుత వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్చడమేనని స్పష్టం చేసింది.