హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17(నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన సేల్స్ఫోర్స్..హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ)ని మరింత విస్తరించింది. నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిస్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఇంజినీరింగ్ అండ్ కస్టమర్ సెంటర్ ఇదే కావడం విశేషం. గత పదేండ్లుగా భారత్లో కార్యకలాపాలు అందిస్తున్న సంస్థ..2016లో హైదరాబాద్లో సంస్థ సీవోఈని ప్రారంభించింది.
బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పుణె, జైపూర్లలో ఉన్న కార్యాలయాల్లో 9 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 6.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన విశాలమైన ప్రాంగణంలో 4,500 మంది కూర్చోవడానికి వీలుంటుంది. సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ తల్లా ప్రగడ మాట్లాడుతూ.. పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మారిందని, ప్రపంచస్థాయి ప్రతిభ కలిగిన సిబ్బందితో ఇక్కడి నుంచి ఆవిష్కరణలను చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థకు ఎయిర్ ఇండియా, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, టాటా క్లిక్యూ,మహీంద్రా లిమిటెడ్లు కస్టమర్లుగా ఉన్నారు.
సేల్స్ఫోర్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్లోని అసాధారణ సాంకేతిక ప్రతిభ, అధిక నాణ్యత మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో జీవన ప్రమాణాలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న కృషి వల్లే సాధ్యమైంది. అత్యున్నత సాంకేతిక సంస్థల్లో ఒకటిగా అవతరించే ప్రయాణంలో సేల్స్ఫోర్స్తో మా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నాం’
– కేటీ రామారావు, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి
భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్నది. డిజిటల్ కనెక్టివిటీ, అత్యధిక ప్రతిభ కలిగిన ఉద్యోగులు లభిస్తుండటంతో అంతర్జాతీయ డిజిటల్ టెక్నాలజీలో భారత్ సత్తాచాటుతున్నది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను విస్తరించడం చాలా సంతోషంగా ఉన్నది’
– అరుంధతీ భట్టాచార్య, సేల్స్ఫోర్స్ ఇండియా సీఈవో, చైర్పర్సన్