న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది జీతాలను దేశంలోని సంస్థలు సగటున 10 శాతం పెంచవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆటోమొబైల్, తయారీ, ఇంజినీరింగ్ రంగాల్లోని ఎంప్లాయీస్ వేతనాలు ఎక్కువగా పెరుగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్స్ చేపట్టిన ‘టోటల్ రెమ్యునరేషన్ సర్వే’ (టీఆర్ఎస్) విడుదలైంది. ఇందులోనే ఈసారి ఉద్యోగుల జీతాలు సగటున 10 శాతం పెరుగవచ్చని తేలింది. గత ఏడాది జీతాల పెంపు సగటున 9.5 శాతంగా ఉన్నట్టు మెర్సర్స్ తమ తాజా రిపోర్టులో పేర్కొన్నది. ‘దేశ ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందనడానికి ఇదో నిదర్శనం. ప్రతిభావంతులు ఎక్కువగా ఉన్నారనడానికీ సంకేతమే.
ఇక ఈ ఏడాది ఆటోమొబైల్, మాన్యుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్, లైఫ్సైన్సెస్ రంగాల్లోని ఉద్యోగుల జీతాలు పెరగవచ్చు’ అని సర్వే పేర్కొన్నది. గత ఏడాది మే, ఆగస్టు మధ్య ఈ సర్వేను జరిపారు. 1,474 సంస్థల్లోని 6 వేల మందికిపైగా అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సంస్థల్లో 21 లక్షల మందికిపైగా ఉద్యోగులుండటం విశేషం. వ్యక్తిగత, సంస్థాగత పనితీరు తదితర అంశాల ప్రాతిపదికన సర్వే చేపట్టారు. మరోవైపు కంపెనీలను ఉద్యోగులు స్వచ్చంధంగా వీడుతున్న సందర్భాలు క్రమేణా పెరుగుతున్నాయని, 2021లో 12.1 శాతంగా ఉంటే, 2022లో 13.5 శాతంగా ఉందని సర్వే తెలిపింది.