ముంబై, జూలై 19: ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తీవ్ర ఒడిదుడుకుల్లోనే ట్రేడ్ అవుతున్నది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం కూడా రికార్డు స్థాయికి పతనమైంది. అయినప్పటికీ చివరకు కాస్త కోలుకోవడం ఊరటనిచ్చింది. ఉదయం ఆరంభం నుంచే పడిపోతున్న దేశీయ కరెన్సీ.. ఒకానొక దశలో మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి 80.05 స్థాయిని తాకింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరిగిన మద్దతు రూపాయిని ముంచేస్తున్నది. అయితే ఆఖర్లో గత ముగింపుతో పోల్చితే 6 పైసలు కోలుకుని 79.92 వద్ద స్థిరపడింది. సోమవారం సైతం రూపాయి మారకం విలువ ఇంట్రా-డేలో మొదటిసారిగా 80.02 స్థాయిని తాకిన విషయం తెలిసిందే. 16 పైసలు క్షీణించి 79.98 వద్ద నిలిచిన సంగతీ విదితమే.
త్వరలోనే 82 స్థాయికి..
రూపాయి మారకం విలువ డాలర్తో చూస్తే 82 స్థాయికి రాబోయే రోజుల్లో పతనం కావచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎగుమతుల కంటే దేశ దిగుమతులు ఎక్కువగా ఉండటం, దేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ పెట్టుబడులు క్షీణిస్తుండటమే ఇప్పుడు ప్రధానంగా రూపాయి విలువను వేగంగా దిగజార్చుతున్నాయని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటం కూడా రూపాయిని ఒత్తిడికి లోనుచేస్తున్నాయని అంటున్నారు. సెప్టెంబర్దాకా రూపాయి మారకం విలువ 78.5-81 మధ్యే ఉండొచ్చని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ కమోడిటీ, కరెన్సీ రిసెర్చ్ ఉపాధ్యక్షుడు సుగంద సచ్దేవ అంచనా వేశారు. అయితే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగుస్తుండటం రూపాయికి కొంత జోష్ను తెస్తున్నదని ఫారెక్స్ మార్కెట్ ట్రేడర్లు తాజా సరళిని అభివర్ణిస్తున్నారు. మంగళవారం ఉదయం నష్టాల్లో కదలాడి చివరకు స్టాక్స్ సూచీలు కూడా లాభపడ్డాయి. తదనుగుణంగానే రూపాయీ పుంజుకున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం కూడా కలిసొచ్చిందంటున్నారు.