నానాటికీ రికార్డు స్థాయిలో పడిపోతున్న రూపాయిని ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆకస్మిక చర్యలు చేపట్టింది.
డాలర్తో పోల్చితే రోజుకింత దిగజారుతున్న దేశీయ కరెన్సీ.. భారత ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్నే ఆందోళనలో పడేస్తున్నది మరి.
దీంతో విదేశీ రుణాలు, డిపాజిట్లు, పెట్టుబడులకున్న నిబంధనల్ని సరళతరం చేస్తూ బక్కచిక్కిన రూపాయిని బలపర్చేలా ఆర్బీఐ పలు నిర్ణయాలు తీసుకున్నది.
ముంబై, జూలై 6: రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ఆకస్మిక నిర్ణయాలు తీసుకున్నది. ఈ క్రమంలోనే కంపెనీల కోసం విదేశీ రుణాల పరిమితిని పెంచింది. అలాగే ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లలో విదేశీ (ఎఫ్పీఐ) పెట్టుబడులకున్న నిబంధనల్ని సరళతరం చేసింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా పతనమైన విషయం తెలిసిందే. బుధవారం ఫారెక్స్ ట్రేడింగ్లో 39 పైసలు కోలుకున్నా.. మంగళవారం 79.33 స్థాయి వద్ద స్థిరపడి ‘ఆల్టైమ్ లో’ రికార్డును నమోదు చేసిన సంగతీ విదితమే. ఈ నేపథ్యంలోనే దేశంలో విదేశీ మారకపు నిల్వల్ని పెంచేందుకు ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది. మార్కెట్లు ముగిసిన కొద్దిసేపటికే ఈ నిర్ణయాలను వెల్లడించగా, ప్రస్తుతం పోర్ట్ఫోలియో పెట్టుబడులు మినహా అన్ని రకాల పెట్టుబడులు స్థిరంగానే ఉన్నట్టు చెప్పింది.
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇప్పటిదాకా డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 4.1 శాతం క్షీణించిందని ఆర్బీఐ తెలియజేసింది. బుధవారం కోలుకుని 78.94 వద్ద స్థిరపడినా.. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ తన తాజా చర్యలతో చెప్పకనే చెప్పింది. ఇదిలావుంటే గత నెల 24 నాటికి దేశంలో విదేశీ మారకపు నిల్వలు 593.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నిజానికి ఫారెక్స్ మార్కెట్ను నిశితంగా గమనిస్తున్నామని ఆర్బీఐ చెప్తూనే ఉన్నది. అయినప్పటికీ రూపాయి పతనం మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడీ నిర్ణయాలు తీసుకున్నది.
ప్రవాస భారతీయులు (ఎన్నారై) చేసే విదేశీ డిపాజిట్లపై బ్యాంకులు ఇచ్చే వడ్డీరేటుకున్న పరిమితిని ఆర్బీఐ తొలగించింది. ఎన్నారైలను ఆకట్టుకునేలా వడ్డీరేట్లను ఆఫర్ చేసుకోవచ్చన్నది. అక్టోబర్ ఆఖరుదాకా ఈ సడలింపు అమల్లో ఉండనున్నది. ఈ నిర్ణయం.. భారతీయ బ్యాంకుల్లో ఎన్నారైలు తమ మిగులు నగదు నిల్వలను ఉంచడానికి దోహదపడుతుందని ఆర్బీఐ విశ్వసిస్తున్నది.