ముంబై, నవంబర్ 10: ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్య ప్రభావంతో శుక్రవారం రూపాయి చరిత్రాత్మక కనిష్ఠస్థాయి 83.49 వద్దకు పతనమయ్యింది. ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, ద్రవ్యలోటు విస్త్రతంకావడం, ఎగుమతులు పడిపోవడం, వాణిజ్యలోటు అంతకంతకూ పెరిగిపోవడం, తయారీ, మౌలిక పరిశ్రమలు గాడితప్పడం, విదేశీయులు దేశీ మార్కెట్ నుంచి నిధులు తరలించుకుపోవడం వంటి అంశాలన్నీ కరెన్సీని కుదేలుచేస్తున్నాయి.
కొద్ది రోజులుగా ఏ మాత్రం కోలుకోకుండా బలహీనంగా ట్రేడవుతున్న రూపాయి శుక్రవారం హఠాత్తుగా ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) ఇంట్రాడే ట్రేడింగ్లో 83.49 వద్దకు పతనమయ్యింది. ఇంత కనిష్ఠస్థాయికి తగ్గడం చరిత్రలో ఇదే ప్రధమం. గత రికార్డు కనిష్ఠస్థాయి 83.36కాగా, ఈ స్థాయిని సైతం తాజాగా ప్రొవిజనల్గా ఆల్టైమ్ కనిష్ఠస్థాయి 83.33 వద్ద ముగిసినప్పటికీ, తుది డాటా ప్రకారం క్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే ఫ్లాట్గా 82.28 వద్ద నిలిచింది. ఈ ఏడాది సెప్టెంబర్ 18న ముగింపు 83.32 ఇప్పటివరకూ రికార్డు కనిష్ఠ ముగింపు.
దేశీయ నిరుత్సాహకర ఆర్థికాంశాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలపడటం, భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా నిధులు తరలించుకుపోవడం, మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతలు తదితర ప్రతికూల అంశాల నడుమ రిజర్వ్బ్యాంక్ రూపాయికి మద్దతుగా నిలబడలేదని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయంటూ తాజాగా సంకేతాల్విడంతో డాలర్ ఇండెక్స్ 105.70 స్థాయికి బలపడింది. దీంతో భారత్తో సహా పలు వర్థమాన దేశాల కరెన్సీలు క్షీణబాట పట్టాయి.