US Dollar Vs Rupee | ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ మరో ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ధరలను కట్టడి చేయడానికి అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు 75 పాయింట్లు పెంచడంతో డాలర్ మీద రూపాయి మారకం విలువ దారుణంగా పతనమైంది. గురువారం ఇంట్రాడే ట్రేడింగ్లో ఒకానొక దశలో 1.24 శాతం నఫ్టపోయి రూ.80.91లకు పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ముగింపులో 90 పైసల నష్టంతో రూ.80.86తో సరిపెట్టుకున్నది. యూఎస్ డాలర్ మీద రూపాయి విలువ అత్యంత కనిష్టం ఇదే.
అమెరికా ఫెడ్ రిజర్వు చైర్మన్ జెరోమ్ కీలక వడ్డీరేట్లు 75 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించారు. దీంతో అమెరికాలో వడ్డీరేట్లు 3.25 శాతానికి పెరిగాయి. అంతే కాదు.. పెంచేయడంతోపాటు భవిష్యత్లో మరిన్ని వడ్డీరేట్లు పెంచుతామని సంకేతాలిచ్చారు. దీంతో డాలర్ విలువ బలోపేతమైంది. తత్ఫలితంగా స్టాక్ మార్కెట్లలో బలహీనతలు, చమురు ధరలు నిలకడగా కొనసాగడంతో రూపాయి భారీ పతనానికి కారణం అని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వడ్డీరేట్లు పెంచుతూ యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయం తీసుకోవడంతో భారత్ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరిస్తారు. దాని వల్ల అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ మరింత పతనం అవుతుంది. రూపాయి బలహీన పడటం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుాయి. వివిధ వస్తువులు, సేవల కొనుగోళ్లకు నిధులు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకించి విదేశాల నుంచి ముడి చమురు, బంగారం, వంట నూనెలు, పప్పు దినుసులను దిగుమతి చేసుకుంటున్నాం. డాలర్ విలువ పెరగడం వల్ల వాటి ధరలు మరింత పైపైకి దూసుకెళ్తాయని ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. వివిధ పారిశ్రామిక ఉత్పత్తుల్లో వినియోగించే ముడి సరుకు కూడా విదేశాల నుంచే దిగుమతి అవుతున్నది. కనుక ఆయా ఉత్పత్తుల ధరలు కూడా పిరం అవుతాయని చెబుతున్నారు.
భారత్ నుంచి వివిధ దేశాలకు ఐటీ సేవలు ఎగుమతి చేస్తారు. ఫార్మా రంగం కూడా తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తుంది. కనుక ఐటీ, ఫార్మా రంగాల సంస్థలకు లాభాలు చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు.