ముంబై, ఏప్రిల్ 29: దేశీయ కరెన్సీ విలువ మరింత కరిగిపోయింది. డాలర్తో పోలిస్తే మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే కరెన్సీ విలువ 20 పైసలు కోల్పోయి ఆల్టైంకు కనిష్ఠ స్థాయి 94.88కి పడిపోయింది. ఇంధన ధరలు భగ్గుమనడంతో రూపాయితోపాటు ఇతర కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. దీనికి తోడు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం కూడా రూపాయి పతనానికి ఆజ్యంపోశాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 115 డాలర్ల పైకి చేరుకోవడంతో దేశీయ దిగుమతుల భారం మరింత పెరగనున్నదని, అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా ఆందోళనను మరింత పెంచిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అంతా ఆశాజనకంగా లేకపోవడంతో అమెరికా ఫెడరల్ రిజర్వు ఈసారి ద్రవ్యపరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలుండటం కూడా పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ను నీరుగార్చిందని పేర్కొన్నారు. 94.79 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు చివరకు 20 పైసల నష్టంతో 94.88 వద్దకు పడిపోయింది. మంగళవారం కూడా రూపాయి విలువ 53 పైసలు కోల్పోయిన విషయం తెలిసిందే.