అవును. మోదీ చెప్పినట్టు అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ అధఃపాతాళానికి పడిపోతున్న విధానాన్ని దేశప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు.
తొమ్మిదేండ్ల బీజేపీపాలనలో డాలర్తో రూపాయి విలువ ఏకంగా 42.43 శాతం పతనమైంది. ఆసియాలో మరే దేశ కరెన్సీ ఈ స్థాయిలో దిగజారలేదు.
రూపాయి విలువ పతనంతో ఎక్కువ మొత్తంలో నష్టపోయేది సామాన్యుడేనని తెలుసా?
Rupee Value | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ బుధవారం మరో 14 పైసలు తగ్గి 83.18 వద్ద నిలిచింది. గడిచిన 10 నెలల్లో ఇదే కనిష్ఠం. ఫారెక్స్ మార్కెట్లో 83.13వద్ద ముగిసింది. రూపాయి ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు క్రమంగా తరలిపోతుండటం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలకు రెక్కలు, అమెరికా డాలర్లకు ఫారెక్స్ మార్కెట్లో పెరిగిన డిమాండ్, ప్రభుత్వ అసమర్థ విధానాలు వెరసి రూపాయి విలువ అంతకంతకూ బలహీనపడుతున్నది. అంతకంతకూ క్షీణిస్తున్న రూపాయి విలువ కారణంగా ప్రస్తుతం దేశానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల జీవనం దినదినగండంగా మారబోతున్నది.
మనకు స్వాతంత్య్రం వచ్చిననాడు రూపాయి, డాలర్ విలువ సమానం. ఇప్పుడు చూడండి రూపాయి విలువ ఎలా పతనమవుతున్నదో..? ఈ విషయాన్ని దేశప్రజలందరూ గమనించాలి.
– ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందు జూన్ 14, 2013న నరేంద్రమోదీ అన్న మాటలివి
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పడిపోతే అన్నింటిపైనా ఆ ప్రభావం పడుతుంది. ముందుగా భారత్ దాదాపు 80 శాతం వరకు దిగుమతి చేసుకొంటున్న ముడి చమురుపై ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. చమురు చెల్లింపులు అంతర్జాతీయ కరెన్సీ అమెరికన్ డాలర్ల ప్రాతిపదికన చేస్తుండటంతో ఎక్కువ మొత్తంలో డాలర్లను ఖర్చు చేయాల్సివస్తుంది. దీంతో ఒకవైపు రిజర్వ్బ్యాంక్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు కరిగిపోవడంతో పాటు దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెరుగొచ్చు. ఇంధన ధరలు పెరిగితే రైల్వే, బస్సు చార్జీల వాత తప్పదు.
ఇంధనం ధరలు పెరుగడం వల్ల రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయి. దీంతో ఆ ప్రభావం కూరగాయలు, పాలు, పప్పులు, ఉప్పులు ఇలా మార్కెట్లో ప్రతీ వస్తువుపై పడుతుంది. అంతిమంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతాయి.
రూపాయి క్షీణత.. బ్యాంకు రుణాలపై పరోక్షంగా ప్రభావం చూపిస్తుంది. పెరిగే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లను సవరిస్తుంది. దీంతో గృహ, కారు రుణాలను తీసుకొన్న సామాన్యులపై ఈఎంఐల భారం మరింతగా పెరుగుతుంది.
మొబైల్ ఫోన్, టీవీ సెట్లు, కంప్యూటర్ల తయారీకి అవసరమైన ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు 80 శాతం మేర విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. రూపాయి విలువ ఒక శాతం పడిపోతే అందులో 0.6 శాతం మొబైల్, టీవీలు, కంప్యూటర్ల సరఫరా వ్యవస్థపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే వీటి ధరలు కూడా పెరుగుతాయన్న మాట.
70 శాతం మేర దేశీయ విద్యుత్తు అవసరాలను బొగ్గు తీరుస్తున్నది. భారత్ పెద్దయెత్తున విదేశాల నుంచి బొగ్గు, కుకింగ్ కోల్ను దిగుమతి చేసుకొంటున్నది. రూపాయి క్షీణతతో ఇది భారంగా మారొచ్చు. ఫలితంగా విద్యుత్తు చార్జీలు కూడా పెరిగే అవకాశమున్నది.
రూపాయి పతనంతో విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఫీజుల కోసం అధికంగా చెల్లించాల్సి రావొచ్చు. వైద్య చికిత్సల కోసం, పర్యటనల కోసం విదేశాలకు వెళ్లే వారి బడ్జెట్ పరిమాణం కూడా అనూహ్యంగా పెరిగిపోతుంది. దేశీయంగా ఇంధన ధరల పెరుగుదలతో విమాన టికెట్ల రేట్లు కూడా పెరుగుతాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రుణం పొందిన భారతీయ సంస్థలు తిరిగి వాటిని చెల్లించేందుకు చేస్తున్న ఖర్చు పెరిగిపోతుంది. రూపాయి విలువ తగ్గుతుండటంతో ద్రవ్యలోటు కూడా పెరుగుతుంది.
కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచి రూపాయి మారకం విలువ భారీగా ఆవిరైపోయింది. 2014లో డాలర్తో పోల్చితే రూపాయి మారకం రూ. 58 వద్ద ఉంటే ప్రస్తుతం రూ. 83కు చేరుకొన్నది. దీంతో 9 ఏండ్లలో కరెన్సీ విలువ రూ. 25 మేర పతనమైనైట్లెంది.
చమురు ధరల పెరుగుదల- పెట్రోల్, డీజిల్ రేట్లు పైపైకి విమానం, రైల్వే, బస్సు టికెట్ రేట్లు పెంపు
డీజిల్ రేట్లు పైకి సామాన్యుడి జేబుకు చిల్లు
పప్పులు, కూరగాయల రేట్లు పైకి
మొబైల్, టీవీ, కంప్యూటర్ల ధరల్లో పెరుగుదల
గృహ, కారు వంటి రుణాలు పిరం, ఈఎంఐ పెరుగుదల
వర్సిటీ ఫీజుల్లో పెరుగుదల