ముంబై, డిసెంబర్ 21: ఫారెక్స్ మార్కెట్లో రూపాయి నేలచూపులు చూస్తున్నది. డాలర్తో పోల్చితే రూపీ మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. ఈ వారం మొత్తంగా జరిగిన 4 సెషన్లలో రూపీ ఎక్సేంజ్ రేటు 24 పైసలు దిగజారడం గమనార్హం. గురువారం 9 పైసలు కోల్పోయి 83.27 వద్ద స్థిరపడింది. అంతకుముందు బుధవారం ట్రేడింగ్లో ఎక్కడిదక్కడే ఉన్న రూపాయి మారకం విలువ.. మంగళవారం 8 పైసలు, సోమవారం 7 పైసలు చొప్పున నష్టపోయింది. దీంతో క్షీణత స్థాయి 24 పైసలకు చేరింది.
ఆందోళనకరంగా..
ఎర్ర సముద్ర మార్గంలో సాగుతున్న అంతర్జాతీయ వర్తక, వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం కలుగడంతో మదుపర్ల సెంటిమెంట్ ఒక్కసారిగా బలహీనపడిందని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్ నుంచి విదేశీ మదుపరులు పెట్టుబడులు ఉపసంహరించుకుంటుండటం.. రూపీ విలువను అంతకంతకూ పతనం దిశగా నడిపిస్తున్నదని వారు పేర్కొంటున్నారు.
స్టాక్ ఎక్సేంజీల వివరాల ప్రకారం బుధవారం విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.1,322.08 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నిజానికి దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అయినప్పటికీ ఆ ప్రభావం ఫారెక్స్ మార్కెట్పై పడకపోవడానికి ఈ రకమైన గ్లోబల్ అనిశ్చిత పరిస్థితులే కారణమని చెప్తున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో ఒడిదొడుకులు కూడా దెబ్బతీస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు.
ఇలాగే సాగితే..
ఫారెక్స్ మార్కెట్లో రూపాయికి ప్రతికూల పరిస్థితులు ఇలాగే సాగితే దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికరమేనన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. ఇప్పటికే దేశంలో ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రూపాయి పతనం.. దేశీయ దిగుమతుల్ని మరింత భారం చేస్తుం ది. ముఖ్యంగా దేశీయ ఇంధన అవసరాల్లో 80 శాతం విదేశీ చమురు దిగుమతుల ద్వారానే తీరుతున్న సంగతి విదితమే. దీంతో రూపీ నష్టాలు.. పెట్రో ఉత్పత్తుల రేట్లను ఎగదోసేలా తయారవుతున్నాయి. ఇదే జరిగితే ద్రవ్యోల్బణం ఇంకా పెరిగి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను పెంచేస్తాయని, గృహ, వాహన తదితర రుణాలు ప్రియమై ఆయా రంగాల్లో వ్యాపారాలు పడిపోతాయని అంటున్నారు. కాబట్టి రూపా యి విలువపట్ల అటు కేంద్రం, ఇటు ఆర్బీఐ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.