అధిక వడ్డీ రేట్ల వ్యవస్థ దీర్ఘకాలం కొనసాగుతుందన్న భయాల నడుమ.. గత వారం ప్రథమార్ధంలో నిలువునా పతనమైన ఈక్విటీ మార్కెట్ ద్వితీయార్ధంలో అంతేవేగంగా కోలుకున్నది. తొలుత 19,333 పాయింట్ల కనిష్ఠస్థాయికి తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 19,653 పాయింట్ల వద్ద నిలిచింది. అంతక్రితం వారంకంటే 15 పాయింట్ల స్వల్పలాభంతో ముగిసింది. కీలకమైన 20 వారాల మూవింగ్ ఏవరేజ్ స్థాయి నుంచి రికవరీ అయ్యి 20 రోజుల మూవింగ్ ఏవరేజ్ స్థాయికి చేరినందున, ఈ వారం పుల్బ్యాక్ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా, ఈక్విటీరీసెర్చ్ ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్లు అంచనా వేశారు. స్వల్పకాలిక నిఫ్టీ ట్రెండ్ పాజిటివ్గా మారినట్టు డెయిలీ, వీక్లీ చార్టులు సూచిస్తున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్ నాగరాజ్ షెట్టి తెలిపారు. అయితే ఇండియా ఓలటాలిటీ ఇండెక్స్ (వీఐఎక్స్) దాదాపు జీవితకాల కనిష్ఠస్థాయి 10.06 వద్దకు తగ్గిన నేపథ్యంలో ఇది ఏ మాత్రం పెరిగినా మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడతాయని వైష్ణవ్ హెచ్చరించారు.
ఈ వారం నిఫ్టీకి 19,500 స్థాయి వద్ద పుట్రైటర్లు కీలక మద్దతును అందిస్తారని, 19,600పైన నిలబడితే 19,750-19,800 శ్రేణి వరకూ పుల్బ్యాక్ ర్యాలీ కొనసాగుతుందని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ రూపక్ డే అంచనా వేశారు. నిఫ్టీ 19,500 స్థాయిని కోల్పోనంతవరకూ ప్రతీ తగ్గుదలలో కొనుగోళ్లు జరపవచ్చని ఇన్వెస్టర్లకు సూచించారు. ఈ వారం సూచీ పాజిటివ్గా ప్రారంభమవుతుందని, అటుతర్వాత 19,780, 19,900 స్థాయిలు అవరోధం కల్గించవచ్చని మిలన్ వైష్ణవ్ విశ్లేషించారు. తొలి మద్దతు 19,500 పాయింట్ల వద్ద లభిస్తుండగా, ఆ దిగువన 19,320 వరకూ తగ్గవచ్చన్నారు. 19,550-19,500 స్థాయికి తగ్గితే కొనుగోళ్లకు అవకాశమని, 19,800 సమీపంలో నిరోధాన్ని చవిచూడవచ్చని నాగరాజ్ షెట్టి అంచనా వేశారు.