న్యూఢిల్లీ, అక్టోబర్ 17: భూషణ్ స్టీల్ లిమిటెడ్ (బీఎస్ఎల్) ప్రమోటర్లు, అనుబం ధ సంస్థలపై ఈడీ దాడులు జరిపింది. రూ.56,000 కోట్ల మేరకు బ్యాంక్లకు టోపీవేసి, నిధులు మళ్లించారన్న కేసులో భాగంగా జరిగిన దాడుల్లో రూ.72 లక్షల నగదు, రూ.52 లక్షల విలువైన విదేశీ కరెన్సీ/ట్రావెలర్ చెక్కులు, రూ.4 కోట్ల విలువైన మూడు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది. బీఎస్ఎల్ ఎండీ నీరజ్ సింఘాల్, ఆయన సహచరులు పలు షెల్ కంపెనీలు ఏర్పాటుచేసి, నిధులు మళ్లించారని ఈడీ ఆరోపించింది.
బీఎస్ఎల్ ప్రమోటర్లు, డైరెక్టర్లు, అధికారులు నకిలీ డాక్యుమెంట్లు రూపొందించి, ఎల్సీలను (లెటర్స్ ఆఫ్ క్రెడిట్) బ్యాంక్ల్లో డిస్కౌంట్ చేసుకుని, ఆ నిధుల్ని వారి సొంత షెల్ కంపెనీలకు మళ్లించుకున్నారని ఈడీ వివరించింది. దీంతో ఎస్బీఐ, పీఎన్బీలకు భారీ నష్టం కల్గించారన్నది. ఈ ఏడాది జూన్లో నీరజ్ సింఘాల్ను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటివరకూ రూ.61.38 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. 2018లో భూషణ్ స్టీల్ను టాటా స్టీల్ టేకోవర్ చేసింది.