న్యూఢిల్లీ, జనవరి 4: దేశంలో విద్యుత్తు ఆధారిత (ఎలక్ట్రిక్) వాహనాలను ప్రోత్సహించేందుకు తెచ్చిన ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్) పథకం మూడో విడుత అమలు కోసం ప్రయత్నిస్తున్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ.. రూ.26,400 కోట్ల కేటాయింపుల్ని ప్రతిపాదిస్తున్నది. ఇండస్ట్రీ వర్గాలతో చర్చల అనంతరం ఎలక్ట్రిక్ టూవీలర్ల కొనుగోలుదారులకు రాయితీలుగా ఇచ్చేందుకు రూ.8,158 కోట్లు అవసరమని చెప్తున్నది. అలాగే ఈ-బస్సులకు రూ.9,600 కోట్లు, త్రీవీలర్లకు రూ.4,100 కోట్లు, ఫోర్వీలర్లకు రూ.1,800 కోట్లు, ఈ-ట్రాక్టర్లకు రూ.200 కోట్లతోపాటు ఇతరత్రా ప్రోత్సాహకాల కోసం ఆర్థిక శాఖ వద్ద పట్టుబడుతున్నది. కాగా, ఫేమ్-1, 2 తర్వాత కూడా 3 అవసరమా? అన్న కోణంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నది.