హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే పరిశ్రమలన్నీ హైదరాబాద్నుంచి ఆంధ్రాకు తరలిపోతాయని.. తెలంగాణకు ఒక్క పరిశ్రమ కూడా రాదంటూ కల్పించిన అపోహలు పటాపంచలయ్యాయి. కానీ, రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రాకు తరలిపోకపోగా.. అక్కడ పెట్టుబడులు పెడదామని వెళ్లినవారు సైతం మళ్లీ తెలంగాణవైపు దృష్టిసారిస్తున్నారు. ఆహారశుద్ధి పరిశ్రమల రంగంలో డజనుకు పైగా కంపెనీలు పెట్టడానికి ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణకు తరలిరావడం ఇందుకు ఉదాహరణ. తూర్పుగోదావరిలో పరిశ్రమస్థాపనకు సన్నాహాలు చేసుకొన్న ఒక పారిశ్రామికవేత్త తాజాగా నిజామాబాద్లో రూ.200 కోట్లతో అదే పరిశ్రమ పెట్టడానికి తరలివచ్చారు.
తెలంగాణే మేలు
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ శివారులో నూనె పరిశ్రమ ఏర్పాటుచేసిన ఆంధ్రాకు చెందిన దక్షిణ ఆగ్రోపోలీస్ సంస్థ.. విభజన అనంతరం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో రూ.200 కోట్లతో భారీస్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుచేయడంకోసం అక్కడ స్థలాన్ని కొన్నది. ప్రభుత్వ అనుమతుల్లో జాప్యంతోపాటు.. పరిశ్రమ స్థాపించే సమయానికి అక్కడ మైనింగ్ కోసం మరో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. మైనింగ్ పక్కన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నడపడం సాధ్యం కాదని ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో తెలంగాణలోని నిజామాబాద్లో పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సంస్థ పప్పుధాన్యాల ప్రాసెసింగ్, బెల్లం నుంచి అనుబంధ పదార్థాల ఉత్పత్తి, బయోమాస్ నుంచి సీఎన్జీ తయారీ, పండిపదార్థాల ఉత్పత్తిని చేపడుతుంది. ఇటీవల ఈ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్తో సమావేశమై అభ్యర్థించగా ప్రభుత్వం నుంచి కల్పించాల్సిన అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. త్వరలోనే తమ యూనిట్ ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. డజనుకుపైగా ఆంధ్రా పెట్టుబడిదారులు నిజామాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు స్థలాలు కొన్నట్టు టీఎస్ఐఐసీ అధికారులు తెలిపారు.