న్యూఢిల్లీ: కరోనాను నియంత్రించడానికి డెవలప్ చేసిన వ్యాక్సిన్ కోవాగ్జిన్ను నిరంతరం రూ.150లకు కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేయడం ఆమోదయోగ్యం కాబోదని దాని తయారీ సంస్థ భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.
తక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ల సేకరణ, అధిక పంపిణీ ఖర్చులు, రిటైల్ మార్జిన్లు తదితర అంశాల నేపథ్యంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్కు అధిక ధర నిర్ణయించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఇతర ప్రైవేట్ సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లతో పోలిస్తే తాము నిర్ణయించిన వ్యాక్సిన్ ధర న్యాయబద్ధమేనని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400, ప్రైవేట్ దవాఖానలకు రూ.1,200లకు భారత్ బయోటెక్ పంపిణీ చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు మొత్తం వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 10 శాతం మాత్రమే ప్రైవేట్ దవాఖానలకు సరఫరా చేసింది. మిగతా మొత్తం టీకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం తొలుత 45 ఏండ్లు దాటిన వారికి మాత్రమే ఉచితంగా టీకాలు సరఫరా చేస్తామని ప్రకటించింది. తర్వాత పరిస్థితులు విషమించడంతో తాజాగా వ్యాక్సిన్ పాలసీని ప్రకటిస్తూ.. అందరికీ ఉచితంగా టీకా వేయిస్తామని హామీ ఇచ్చింది.