న్యూఢిల్లీ, జనవరి 19: లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్-రాయిస్..దేశీయ మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసింది. స్పెక్ట్రా పేరుతో విడుదల చేసిన తొలి ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ కారు ఇదేనని తెలిపింది. ఈ కారు ప్రారంభ ధర రూ.7.5 కోట్లుగా నిర్ణయించింది. పూర్తిస్థాయి బ్యాటరీ రీచార్జి కావడానికి ఐదు గంటలు పట్టనున్నది. ఇలా బ్యాటరీ రీచార్జితో 530 కిలోమీటర్లు ప్రయాణించనున్నదని తెలిపింది. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్లలో ఉన్న షోరూంలలో మాత్రమే ఈ కారు లభించనున్నది. ఈ సందర్భంగా రోల్స్-రాయిస్ కార్లను విక్రయిస్తున్న సెలెక్ట్ కార్స్ సీఈవో యాదుర్ కపూర్ మాట్లాడుతూ..దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటంతో లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకొని దేశీయంగా విక్రయిస్తుండటంతో ఈ కారు కోసం ఆరు నుంచి ఎనిమిది నెలలపాటు వేచి చూడాల్సిందేనని చెప్పారు.