Rolls-Royce Spectre-EV | ప్రముఖ బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్.. భారత్ మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ కారు ‘స్పెక్ట్రర్’ను ఆవిష్కరించింది. ఆల్ట్రా లగ్జరీ ఎలక్ట్రిక్ సూపర్ కూపే స్పెక్టర్ ధర రూ.7.5 కోట్లు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి రిలీజ్ చేసిన తొలి ఈవీ కారు ఇదే. గతేడాది అక్టోబర్లో ఇంగ్లండ్లోని వెస్ట్ సుస్సెక్స్లో గల రోల్స్ రాయిస్ హోంలో ఈ ‘స్పెక్టర్’ కారు ఆవిష్కరించింది. సింగిల్ చార్జింగ్తో 530 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. డ్యుయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ గల ఈ కారులో 102 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అందిస్తున్నది. కేవలం 4.5 సెకన్లలోనే 100 కి.మీ వేగంతో దూసుకెళ్లడం దీని స్పెషాలిటీ. 21-అంగుళాల అల్లాయ్ వీల్స్, 102 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. స్పెక్టర్ కారు డ్యుయల్ మోటార్ సెటప్తో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ కలిగి ఉండటంతోపాటు 577 హెచ్పీ విద్యుత్, 500 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
డీసీ ఫాస్ట్ చార్జర్ సాయంతో స్పెక్టర్ బ్యాటరీని 34 నిమిషాల్లో చార్జింగ్ చేయొచ్చు. 195 కిలోవాట్ల డీసీ చార్జర్ మద్దతుతో 22 కిలోవాట్ల ఏసీ లేదా 50 కిలోవాట్ల బ్యాటరీ ప్యాకప్ ఉంటుంది. రోల్స్ రాయిస్ ‘రైత్’ను పోలి ఉండే స్పెక్టర్ ఫ్రంట్ గ్రిల్లె వైడ్గా ఇల్యూమినేట్ చేశారు. నాలుగు సీట్ల ఈ ఎలక్ట్రిక్ కూపే రెండు డోర్లు, 23 అంగుళాల వీల్స్ కలిగి ఉంటుంది.