MBBS Costly | రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పెరిగిన కమొడిటీస్ ధరలు.. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ విలువ పైపైకి దూసుకెళ్లడంతో ఎలక్ట్రానిక్స్, ఫార్మా ఉత్పత్తుల ధరలు ప్రియం కానున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 139 డాలర్లకు చేరుకోవడంతో డాలర్పై రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. 77.02 స్థాయికి పతనమైన రూపాయి 81 పైసలు నష్టపోయింది. ఇది 2008 జూలై నుంచి అత్యధికం.దీని ప్రభావంతో విదేశాల్లో ఎంబీబీఎస్, ఇతర కోర్సులు చదివేందుకు తీసుకునే బ్యాంకు రుణాలు.. స్మార్ట్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల ధరలు పెరుగుతాయి.. ఇక మన ఆరోగ్యంలో కీలకమైన ఔషధాల ధరలు కూడా పైపైకి దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తున్నది.
డాలర్ ధర పెరగడంతో విదేశాల్లో ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంబీఏ తదితర ఉన్నత విద్యాకోర్సులను అభ్యసించడానికి వెళ్లే విద్యార్థుల విద్యా రుణ భారం కూడా కాస్ట్లీ కానున్నది. ఆయా కోర్సుల ఫీజులు, లివింగ్ కాస్ట్ పెరుగుతుంది. తదనుగుణంగా రుణ భారం కూడా పెరుగుతుంది. ఉదాహరణకు ఇప్పుడు విదేశీ ఉన్నత విద్యా రుణం రూ.40 లక్షలు తీసుకుంటే, మున్ముందు రూ.44 లక్షలకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. రుణం మొత్తం పెరిగితే టెన్యూర్ లేదా నెలసరి వాయిదాలు కూడా పెరుగుతాయి.
భవిష్యత్లో విదేశాల్లో సంపాదించుకునే మార్గాలను బట్టే ఆయా దేశాల్లో ఉన్నత విద్యా కోర్సులు చదవడానికి విద్యార్థులు రుణాలు తీసుకుంటారు. వారిలో చాలా మంది త్వరలోనే ఉద్యోగం సంపాదించుకుంటారు.. తద్వారా చివరి వాయిదా రుణం తీసుకోరు. సాధ్యమైనంత త్వరగా రుణాల చెల్లింపునకు ప్రాధాన్యం ఇస్తుంటారు. విదేశీ విద్యా రుణాల చెల్లింపునకు సుమారు రెండున్నరేండ్ల నుంచి మూడేండ్ల గడువు.. అటుపై కొంత గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది.
డాలర్పై రూపాయి మారకం విలువ పడిపోవడం వల్ల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అంటే స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, లాప్టాప్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు మరింత పైపైకి దూసుకెళ్తాయని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల్లోవాడే విడి భాగాలను దిగుమతి చేసుకోవాల్సిందే. దిగుమతి చేసుకునే ఆయా ఎలక్ట్రానిక్ విడి భాగాలపై సుంకాలు పెరుగుతాయి. దాని ప్రభావం స్మార్ట్ ఫోన్లు, టీవీలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాల ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది. వచ్చే త్రైమాసికంలో ఉత్పత్తి తగ్గి వాటి ధరల పెరుగుదలకు దారి తీస్తుందని రీసొల్యూట్ ఎలక్ట్రానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ రమీందర్ సింగ్ సోయిన్ చెప్పారు.
దేశీయ ఔషధ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంటుంది. డాలర్ విలువ పెరగడంతో అధిక రెవెన్యూ రావచ్చు. కానీ ఔషధాల తయారీలో కీలక ముడి పదార్థాల కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. తదనుగుణంగా రెవెన్యూ పెరిగినా.. దిగుమతి సుంకాల కోసం ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి రావచ్చు. ఎగుమతుల్లో వచ్చే లాభాలను సుంకాలు మింగేస్తాయంటున్నారు.
ఐటీ సేవల ఎగుమతితో రెవెన్యూ పెరుగుదల ఇలా
ఇక డాలర్ విలువ పెరగడంతో తెలంగాణ నుంచి ఐటీ సేవల ఎగుమతులతో రెవెన్యూ పెరుగుతుందని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భరణి అరోల్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతుల విలువ రూ.1.45 లక్షల కోట్లుగా ఉంది. ఒడిదొడుకుల నుంచి బయట పడేందుకు పలు ఐటీ కంపెనీలు రక్షణాత్మక విధానాన్ని అమలు చేస్తుంటాయన్నారు.