Rice Export Restrictions | ఒకవేళ దేశీయంగా బియ్యం ధరలు పెరిగితే.. విదేశాలకు బియ్యం ఎగుమతిపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రమారమీ 52 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. గతేడాది కంటే ఇది 1.6 శాతం ఎక్కువ. బఫర్ లెవెల్స్ స్థాయి కంటే ఎక్కువ బియ్యం నిల్వలు ఉండాలని కేంద్రం భావిస్తున్నది. బియ్యం కోసం వచ్చే డిమాండ్కు అనుగుణంగా సరఫరా ఉన్నంత వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఎగుమతి ఆంక్షలు మరింత పెంచాల్సిన అవసరం లేదు. దేశీయ మార్కెట్లో ధరలు పెరిగితే మాత్రం కొన్ని క్యాటగిరీల బియ్యం విదేశాలకు ఎగుమతి చేయకుండా ఆంక్షలు కఠినతరం చేసే అవకాశాలు ఉన్నాయి.
అసాధారణ వర్షఫాతం వల్ల తక్కువగా వరినాట్లు జరగడంతో ధరలు పెరగడానికి గల అవకాశాలను కొట్టి పారేయలేం. ఈ నేపథ్యంలో ధరలను కట్టడి చేయడానికి కొన్ని రకాల బియ్యం ఎగుమతులపై నిషేధంతోపాటు మరికొన్ని రకాల బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకాలు విధించింది. ఉక్రెయిన్పై రష్యా యుద్దం వల్ల ప్రపంచ దేశాలకు అతిపెద్ద బియ్యం ఎగుమతి దారుగా భారత్ నిలవనున్నది. దీనికితోడు అస్థిర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే అంతర్జాతీయంగా ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నొమురా అంచనా వేసింది.
బియ్యం ధరలు ఐదు శాతం పెరిగితే.. ద్రవ్యోల్బణం 0.2 శాతం పెరుగొచ్చు. వినియోగదారుల ధరల సూచీ-రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ)లో బియ్యం వాటా 4.4 శాతం. అయితే ప్రస్తుత ఏడాది 6-7 మెట్రిక్ టన్నుల బియ్యం దిగుబడి తగ్గినా.. దేశీయ అవసరాలకంటే అదనంగా సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ చెబుతున్నది.