డిజిటలైజేషన్ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బ్యాంకు సేవింగ్స్ ఖాతాతో అనుసంధానమైన ఏటీఎం కార్డుతో మనీ విత్ డ్రా చేసుకునేవారు. రాన్రాను ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్.. మొబైల్ యాప్స్ ఆధారిత యూపీఐ పేమెంట్స్ జరిగిపోతున్నాయి. క్షణాల్లో వస్తువులు, సేవల కొనుగోళ్లపై బిల్లులు, చార్జీల చెల్లింపులు పూర్తవుతున్నాయి. యూపీఐ పేమెంట్స్కు సంబంధిత వ్యక్తి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఏటీఎం కార్డు అనుసంధానం తప్పనిసరి.. కానీ బ్యాంకు పొదుపు ఖాతా ఏటీఎం అక్కర్లేకుండానే యూపీఐ యాప్ ఆధారంగా నేరుగా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు.
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఆ దిశగా తొలి అడుగు పడింది. జపాన్ హిటాచీ పేమెంట్ సర్వీసెస్.. మొట్టమొదటి యూపీఐ-ఏటీఎం సేవలు ప్రారంభించింది. దానికి హిటాచీ మనీస్పాట్ ఏటీఎం అనే పేరు పెట్టింది. మంగళవారం ముంబైలో జరిగిన ‘గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్-2023’ దీన్ని ఆవిష్కరించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో కలిసి ఈ సేవలను డిజైన్ చేసినట్లు హిటాచీ పేమెంట్స్ సర్వీసెస్ తెలిపింది. దేశంలోని ఇతర ప్రాంతాలకు దశల వారీగా విస్తరిస్తామని వెల్లడించింది. ‘యూపీఐ ఆధారిత ఏటీఎం ఉపయోగించడం చాలా తేలిక, సురక్షితం కూడా’ అని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ఎండీ కం సీఈఓ సుమిల్ వికంసే చెప్పారు.
ఏటీఎం స్క్రీన్పై ‘యూపీఐ కార్డ్లెస్ క్యాష్’ ఆప్షన్పై క్లిక్ చేసి, మీరు ఎంత విత్ డ్రా చేయాలనుకుంటున్నారో నమోదు చేయాలి. ఆ వెంటనే స్క్రీన్పై వచ్చే క్యూ-ఆర్ కోడ్ను మీ ఫోన్లో గల యూపీఐ ఆధారిత యాప్తో స్కాన్ చేయాలి. అటుపై మీ ట్రాన్సాక్షన్ను ధ్రువీకరిస్తూ యూపీఐ పిన్ కూడా నమోదు చేస్తే సరి.. ఆ వెంటనే మీకు ఏటీఎం మిషన్ నుంచి క్యాష్ బయటకు వస్తుంది.
UPI ATM: The future of fintech is here! 💪🇮🇳 pic.twitter.com/el9ioH3PNP
— Piyush Goyal (@PiyushGoyal) September 7, 2023