న్యూఢిల్లీ, అక్టోబర్ 12: కూరగాయల ధరలు తగ్గడంతో సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠస్థాయి 5.02 శాతానికి దిగివచ్చింది. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అంతక్రితం ఆగస్టు నెలలో 6.83 శాతం కాగా, 2022 సెప్టెంబర్లో 7.41 శాతం. గురువారం జాతీయ గణాంకాల శాఖ విడుదల చేసిన డాటా ప్రకారం ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్కు 9.94 శాతం నుంచి 6.56 శాతానికి తగ్గింది. ఇందులో వెజిటబుల్ బాస్కెట్ ద్రవ్యోల్బణం గణనీయంగా 26.14 శాతం నుంచి 3.39 శాతానికి దిగింది. ముగిసిన నెలలో పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ధరలు అధికంగా ఉన్నాయి. పట్టణాల్లో 4.65 శాతం, గ్రామాల్లో 5.33 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం సైతం గ్రామీణ ప్రాంతాల్లో 6.65 శాతం కాగా, పట్టణాల్లో ఇది 6.35 శాతం.
మళ్లీ పెరుగుతుంది
ద్రవ్యోల్బణం రానున్న నెలల్లో తిరిగి పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ చెప్పారు. రుతుపవనాల అసమానత, కీలకమైన ఖరీఫ్ పంటలైన పప్పు దినుసులు, నూనె గింజల సాగుబడి తగ్గడం, దేశంలోని రిజర్వాయిర్లలో నీటిస్థాయి అంతంతగానే ఉండటం వంటి అంశాల కారణంగా ఆహారోత్పత్తుల ధరలు మళ్లీ పెరగవచ్చని అంచనా వేశారు. వ్యవసాయ దిగుబడి తగ్గనున్నందున, రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం అధికమవుతుందని పీడబ్ల్యూసీ ఇండియా పార్టనర్ రానెన్ బెనర్జీ చెప్పారు.
పెరిగిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: భారత్ పారిశ్రామిక రంగం ఆగస్టు నెలలో పుంజుకుంది. గురువారం వెలువడిన అధికారిక గణాంకాల ప్రకారం ఆగస్టు నెలలో పారిశ్రామికోత్పత్తి సూచి (ఐఐపీ) వృద్ధి రేటు 14 నెలల గరిష్ఠస్థాయి 10.3 శాతానికి పెరిగింది. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల పనితీరు ఈ వృద్ధికి కారణం. 2022 ఆగస్టులో ఐఐపీ మైనస్ 0.7 శాతం. ఈ ఏడాది జూలైలో పారిశ్రామిక వృద్ధి రేటును 5.7 శాతం నుంచి 6 శాతానికి సవరిస్తున్నట్టు గురువారం జాతీయ గణాంకాల శాఖ తెలిపింది.