Retail inflation | అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త నెమ్మదించిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు సోమవారం తెలిపాయి. అక్టోబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 4.87 శాతంగా నమోదైంది. ఇంతకుముందు జూన్ నెల ద్రవ్యోల్బణం కూడా 4.87 శాతంగా రికార్డైంది.
సెప్టెంబర్ లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) మూడు నెలల కనిష్ట స్థాయి 5.02 శాతంగా నమోదైంది. ఇదిలా ఉంటే, గత నెలలో జరిగిన ద్రవ్య పరపతి సమీక్ష (ఎంపీసీ) సమావేశంలో ఆర్బీఐ.. 2022-23లో 6.7 శాతంగా నమోదైన చిల్లర ద్రవ్యోల్బణం 2023-24లో 5.4 శాతంగా నమోదవుతుందని పేర్కొంది.
చిల్లర ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతానికి తీసుకు రావాలని ఆర్బీఐని కేంద్ర ప్రభుత్వం కోరింది. రెండు నెలలకోసారి జరిగే ఎంపీసీ సమీక్షలో రిటైల్ ద్రవ్యోల్బణానికి పలు కారణాలు ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది.