న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాచింది. ఇన్నాళ్లూ తగ్గుతూపోయిన రిటైల్ ధరల సూచీ గత నెలలో మూడు నెలల గరిష్ఠాన్ని తాకింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్లో 5.55 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఆగస్టులో 6.83 శాతంగా ఉన్నది. ఆ తర్వాత రెండు నెలలు తగ్గుముఖం పట్టగా, గత నెల తిరిగి ఎగువముఖం పట్టింది. అంతకుముందు నెల అక్టోబర్లో ఇది 4.87 శాతంగానే ఉన్నది. ఇక నిరుడు నవంబర్లో మాత్రం 5.88 శాతంగా ఉన్నట్టు మంగళవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల్లో తేలింది.
కూరగాయలు, తృణధాన్యాలు తదితర ఆహారోత్పత్తుల ధరలు పెరగడం గత నెల రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఎగదోసింది. సీపీఐలో 50 శాతం వాటా ఆహార ద్రవ్యోల్బణానిదే. ఈ క్రమంలో నవంబర్లో ఆహార ద్రవ్యోల్బణం 8.7 శాతానికి ఎగిసింది. అక్టోబర్లో 6.61 శాతంగానే ఉండగా, నిరుడు నవంబర్లో 4.67 శాతమేనని ఎన్ఎస్వో తెలియజేసింది. గత ఏడాదితో చూస్తే సుగంధద్రవ్యాల ధరలు వార్షిక ప్రాతిపదికన 21.55 శాతం పెరిగాయి. పప్పుధాన్యాలు తదితర ఉత్పత్తులు 20.23 శాతం, కూరగాయలు 17.7 శాతం, పండ్లు 10.95 శాతం, తృణధాన్యాలు ఇతరత్రా ఉత్పత్తులు 10.27 శాతం పుంజుకున్నాయి. అయితే వంటనూనెల ధరలు సుమారు 15 శాతం దిగాయి. ఇక రాష్ర్టాలవారీగా చూస్తే ఒడిశాలో అత్యధికంగా 7.65 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది. అలాగే తెలంగాణ సహా మరికొన్ని రాష్ర్టాల్లో 6 శాతానికిపైగానే ఉన్నట్టు తేలింది. ఢిల్లీలో మాత్రం 3.1 శాతం కనిష్ఠ స్థాయి నమోదైంది.
రిటైల్ ద్రవ్యోల్బణం 5.55 శాతంగా నమోదైనా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశిత పరిధిలోనే ఉన్నది. ఆర్బీఐ 6 శాతాన్ని మించరాదన్న లక్ష్యం పెట్టుకున్నది. అయితే అక్టోబర్తో పోల్చితే పెరిగిన తీరును చూస్తే ఈ నెలకుగాను విడుదలయ్యే గణాంకాల్లో ఆర్బీఐ గీతను ద్రవ్యోల్బణం గణాంకాలు దాటిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనిపిస్తున్నది. ఇదే జరిగితే ఇన్నాళ్లూ ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్ల పెంపు జోలికి వెళ్లని ఆర్బీఐ మళ్లీ వడ్డింపుల్ని షురూ చేస్తుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో గృహ, వాహన తదితర రుణాలన్నీ భారం కావడం ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసిన సంగతి విదితమే. అక్టోబర్-డిసెంబర్లో 5.6 శాతంగా, జనవరి-మార్చిలో 5.2 శాతంగా ఉంటుందన్నది.
అక్టోబర్లో దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు (ఐఐపీ) 16 నెలల గరిష్ఠాన్ని చేరింది. 11.7 శాతంగా నమోదైనట్టు మంగళవారం విడుదలైన ఓ అధికారిక ప్రకటన స్పష్టం చేసింది. తయారీ, విద్యుత్తు, గనుల రంగాల్లో రెండంకెల వృద్ధి ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. నిరుడు అక్టోబర్లో మైనస్ 4.1 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. చివరిసారిగా గత ఏడాది జూన్లో 12.6 శాతం వృద్ధి కనిపించింది. మళ్లీ ఆ దరిదాపుల్లో గణాంకాలుండటం ఇదే తొలిసారి. ఇదిలావుంటే ఈ ఏప్రిల్-అక్టోబర్లో ఐఐపీ వృద్ధి 6.9 శాతంగా ఉన్నది. పోయినసారి 5.3 శాతమే. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ ఐఐపీ గణాంకాలను 6.2 శాతానికి సవరించారు. తొలుత 5.8 శాతంగానే అంచనా వేశారు.