ఫిబ్రవరిలో 10 శాతం పెరిగిన అమ్మకాలు: రాయ్
జోరుగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్, కిరాణా లావాదేవీలు
న్యూఢిల్లీ, మార్చి 14: కరోనా వైరస్ దెబ్బకు మందగమనంలోకి జారుకున్న దేశీయ రిటైల్ వ్యాపారం పుంజుకుంటున్నది. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అమ్మకాలు 10 శాతం పెరిగాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) సోమవారం తెలియజేసింది. 2020 ఫిబ్రవరితో చూస్తే 6 శాతం వృద్ధి ఉందన్నది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్-ఎలక్ట్రానిక్స్, ఆహార-కిరాణా, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్ఆర్) విభాగాల్లో నిరుడుతో చూస్తే గత నెల విక్రయాలు ఆకర్షణీయంగా పెరిగాయని తెలిపింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్-ఎలక్ట్రానిక్స్లో 28 శాతం, ఆహార-కిరాణాలో 19 శాతం, క్యూఎస్ఆర్లో 16 శాతం చొప్పున లావాదేవీలు నమోదైనట్టు రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ తెలిపారు. దుస్తులు, పాదరక్షల సేల్స్లో కూడా రెండంకెల వృద్ధి ఉన్నదని చెప్పారు. దీంతో మార్కెట్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఉత్తరాది టాప్
దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఉత్తరాది రాష్ర్టాల్లో రిటైల్ వ్యాపారాలు ఎక్కువగా పుంజుకున్నట్టు తేలింది. నిరుడు ఫిబ్రవరితో చూస్తే ఈసారి ఫిబ్రవరిలో 17 శాతం అమ్మకాలు ఎగిశాయి. పశ్చిమాది రాష్ర్టాల్లోనూ 16 శాతం వృద్ధి కనిపించింది. అయితే తూర్పు, దక్షిణాది రాష్ర్టాల్లో రిటైల్ వ్యాపార విక్రయాలు పెరిగినా.. ఉత్తర, పశ్చిమాది రాష్ర్టాలతో చూస్తే నాలుగో వంతుకే పరిమితమయ్యాయి. తూర్పు, దక్షిణాది రాష్ర్టాల్లో 4 శాతం చొప్పున సేల్స్ పెరిగినట్టు రాయ్ తెలియజేసింది. అయితే మొత్తంగా 2020, 2021తో పోల్చితే ఈ ఏడాది అమ్మకాలు పుంజుకున్నాయన్నది.
ద్రవ్యోల్బణం, యుద్ధంతో..
ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం రిటైల్ వ్యాపార అమ్మకాలపై కొంతమేరకు ఉన్నదని రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ అన్నారు. అయితే కరోనా కేసులు చాలావరకు తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా మార్కెట్ సమయం పెరిగిందని, చాలా రాష్ర్టాల్లో ఆంక్షలు తొలిగిపోయాయని చెప్పారు. మునుపటిలా దుకాణాలు రాత్రి 9-10 గంటల వరకు ఉంటుండటం.. లావాదేవీల పెరుగుదలకు దోహదం చేసిందన్నారు.