Homes | దేశవ్యాప్తంగా ఇండ్ల ధరలు సగటున ఆరు శాతం పెరిగాయి. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఢిల్లీ నగర శివారుల్లోని గుర్ గ్రామ్ పరిధిలో 12 శాతం ధరలు పెరిగాయని డిజిటల్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సంస్థ ప్రాప్ టైగర్ డాట్ కామ్ తెలిపింది. సొంతిండ్లకు గిరాకీ ఎక్కువ కావడంతో వాటి ధరలు పెరిగాయని ప్రాప్ టైగర్ డాట్ కామ్ పేర్కొంది. గుర్గ్రామ్ పరిధిలో విలాసవంతమైన, మిడ్-సెగ్మెంట్ హౌసింగ్ కు మంచి గిరాకీ ఉంది. గత నెల ఎనిమిదో తేదీన చౌక ఇండ్ల అలాట్ మెంట్ రేట్లు 20 శాతం పెంచుతూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్లే ఇండ్ల ధరలు పెరిగాయని తెలుస్తున్నది.
దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల పరిధిలో ఇండ్ల ధరలు ఒక ఎస్ఎఫ్టీపై రూ.7000-7200 పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఇది ఆరు శాతమెక్కువ. అహ్మదాబాద్, బెంగళూర్, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ-ఎన్సీఆర్, పుణె నగరాల పరిధిలో ఇండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
గుర్ గ్రామ్ పరిధిలో ఒక ఎస్ఎఫ్టీ ధర అత్యధికంగా రూ.7000-7,200 పెరిగితే, తర్వాతీ స్థానంలో బెంగళూర్ నిలిచింది. బెంగళూరులో తొమ్మిది శాతం ధరలు, నొయిడాలో ఎనిమిది శాతం, అహ్మదాబాద్లో ఏడు శాతం పెరిగాయి. అన్ని నగరాల్లో చౌక ధర సెగ్మెంట్లో ఒక ఎస్ఎఫ్టీ ధర రూ.3,700-3,900 మధ్య పెరిగింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఆరు శాతం (రూ.4,800-రూ.5000) ఎక్కువయ్యాయి. చెన్నైలో అతి తక్కువగా మూడు శాతం మాత్రమే పెరిగాయి. ముంబై, పుణెల్లో మూడు శాతం ఎక్కువ పలికింది. ముంబైలో ఒక ఎస్ఎఫ్టీ ధర రూ.10,100-రూ.10,300, పుణెలో రూ.5,600-5,800 మధ్య పెరిగాయి.