ముంబై, సెప్టెంబర్ 26: జేఎం మోర్గాన్ బాండ్ల ఇండెక్స్లో భారత్ బాండ్లను చేర్చిన వార్తతో గతవారం చివర్లో కోలుకున్న రూపాయి తిరిగి పతనబాట పట్టింది. వరుసగా రెండు రోజుల్లో 33 పైసల భారీ నష్టాన్ని చవిచూసింది. మంగళవారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో 83.19 వద్ద ప్రారంభమైన భారత్ కరెన్సీ క్రమేపీ క్షీణించి 83.27 వద్దకు పడిపోయింది. క్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 14 పైసలు తగ్గింది. సోమవారం 19 పైసలు నష్టపోయింది. రిజర్వ్బ్యాంక్ ప్రభుత్వ బ్యాంక్ల సాయంతో డాలర్లను విక్రయించి, రూపాయికి మద్దతు ఇచ్చినప్పటికీ భారత్ కరెన్సీ నిలబడలేదని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. డాలర్ 10 నెలల గరిష్ఠానికి పెరగడం, యూఎస్ 10 ఏండ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్ 16 సంవత్సరాల గరిష్ఠానికి చేరడం తదితర అంశాలతో ఇతర వర్థమాన దేశాల కరెన్సీలతో పాటు రూపాయి బలహీనపడిందని బీఎన్పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి వివరించారు. సమీప భవిష్యత్తులో డాలర్/రూపీ స్పాట్ ధర 82.80-83.80 మధ్య కదలవచ్చన్నారు. రూపాయి తాజా పతనానికి ఫారెక్స్ ట్రేడర్లు చెపుతున్న కారణాలివి&
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గరిష్ఠస్థాయిలో ట్రేడ్కావడం. బ్రెంట్ క్రూడ్ ధర 92.5 డాలర్ల సమీపంలో కదులుతున్నది. దీంతో భారత్ క్రూడ్ దిగుమతులకు రిఫైనింగ్ కంపెనీలు అధికంగా డాలర్లు చెల్లించాల్సిరావడంతో రూపాయి బలహీనపడింది.
యూఎస్ డాలర్ బలపడటం. డాలర్ ఇండెక్స్ 10 నెలల గరిష్ఠస్థాయి 105.94 వద్దకు చేరడంతో పలు వర్థమాన కరెన్సీలతో పాటు రూపాయి సైతం క్షీణబాట పట్టింది.
విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో అదేపనిగా విక్రయాలు జరపడం. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు సెప్టెంబర్లో ఇప్పటివరకూ రూ.14,000 కోట్లకుపైగా వెనక్కు తీసుకున్నారు. సోమవారం మార్కెట్ నుంచి రూ.2,300 కోట్లు ఉపసంహరించుకున్న ఎఫ్పీఐలు మంగళవారం మరో రూ.700 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
రిజర్వ్బ్యాంక్ వద్ద ఫారెక్స్ నిల్వలు 4 బిలియన్ డాలర్లకుపైగా తగ్గి 593 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో రూపాయి రక్షణకు ఆర్బీఐ డాలర్లను ఖర్చుచేయడం తగ్గిస్తుంది.
చైనా రియల్టీ దిగ్గజం ఎవర్గ్రాండే బాండ్ల చెల్లింపులో విఫలంకావడంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి విముఖత చూపుతున్నారని, దీంతో డాలర్ బలపడి, వర్థమాన కరెన్సీలు క్షీణిస్తున్నాయని విశ్లేషకులు చెపుతున్నారు.