Gold Reserves | అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిళ్లు.. అమెరికా, ఈయూ బ్యాంకుల్లో సంక్షోభం.. ద్రవ్యోల్బణం ప్రభావంతో దూసుకొచ్చిన ఆర్థికమాంద్యం ముప్పు.. తదితర సమస్యలు, సవాళ్లను అధిగమించేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) భారీగా బంగారం కొనుగోళ్లు జరిపింది. కొవిడ్-19 తర్వాత ప్రపంచ దేశాల కేంద్రీయ బ్యాంకుల కంటే అధికంగా ఆర్బీఐ బంగారం కొనుగోలు చేసింది. 2020 మార్చి నుంచి 2023 మార్చి వరకు 137.19 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిపింది. దీంతో ఆర్బీఐ వద్ద బంగారం రిజర్వు నిల్వలు 79 శాతం పెరిగి 790.20 టన్నులకు చేరింది. దీని విలువ రూ.3.75 లక్షల కోట్ల పైమాటే. 2020 మార్చి 20 నాటికి మొత్తం విదేశీ మారక ద్రవ్యం నిల్వల్లో బంగారం రిజర్వు నిల్వలు ఆరుశాతం. అత్యధిక బంగారం నిల్వలు గల సెంట్రల్ బ్యాంకుల్లో ఆర్బీఐది ఎనిమిదో స్థానం.
గత ఫిబ్రవరిలో మూడు టన్నుల బంగారం కొనుగోళ్లు జరుపడంతో ఆర్బీఐ బంగారం రిజర్వు నిల్వలు 790.20 టన్నులకు చేరుకున్నదని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. ప్రపంచ దేశాల కేంద్రీయ బ్యాంకుల వద్ద బంగారం నిల్వల్లో భారత్ 8 శాతం వాటా కలిగి ఉన్నది. డబ్ల్యూజీసీ గణాంకాల ప్రకారం 2021-22 తొలి త్రైమాసికంలో భారత్లో బంగారం నిల్వలు 760.42 టన్నులు, రెండో త్రైమాసికానికి 767.89 టన్నులు, మూడో త్రైమాసికానికి 785.35 టన్నులు, మార్చి త్రైమాసికానికి 787.40 టన్నులకు చేరుకున్నది.
ఈ నెల నాలుగో తేదీన అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఏడాదిలోనే రెండు శాతం పెరిగి ఆల్ టైం హై రికార్డు.. 2000 డాలర్ల స్థాయికి చేరుకున్నది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ పతనం కావడం కూడా ఇతర కరెన్సీలు గల వారికి బంగారం చౌకగా మారింది. ఇదిలా ఉంటే, డాలర్ మీద రూపాయి మారకం విలువ పతనం కావడంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఏడు శాతం పెరిగాయని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది. ఒకవైపు యూఎస్ ఫెడ్ రిజర్వు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా, ఆందోళనకర స్థాయిలోనే ద్రవ్యోల్బణం కొనసాగుతున్నది. ఫలితంగా ఇన్వెస్టర్లు బంగారంవైపు మొగ్గు చూపుతున్నారు.
1967 తర్వాత కేంద్రీయ బ్యాంకుల వద్ద బంగారం రిజర్వు నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే మొదటి సారి అని డబ్ల్యూజీసీ వెల్లడించింది. 2022లో సెంట్రల్ బ్యాంకుల గోల్డ్ రిజర్వుల్లో 1136 టన్నుల బంగారం జత కలిసింది. దీని విలువ రూ.5.73 లక్షల కోట్లు. అంతర్జాతీయ అనిశ్చితుల వేళ విదేశాలతో బంగారంతో వాణిజ్య లావాదేవీలు సమర్థవంతంగా జరుపవచ్చు. బంగారం రిజర్వు నిల్వలకు మద్దతుగా అదనపు కరెన్సీ నోట్లు ముద్రించడం తప్పనిసరి. విదేశీ కరెన్సీలతో పోలిస్తే సురక్షితమైన అసెట్ కావడం వల్లే సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటాయి.
తేదీ —————– విదేశీ కరెన్సీ విలువ ——- బంగారం నిల్వలు
20 మార్చి 2020 —- రూ. 32.83 లక్షల కోట్లు—- రూ. 2.09 లక్షల కోట్లు
19 మార్చి 2021 —– రూ. 39.24 లక్షల కోట్లు —- రూ. 2.51 లక్షల కోట్లు
11 మార్చి 2022 —— రూ. 42.45లక్షల కోట్లు —- రూ.3.18 లక్షల కోట్లు
24 మార్చి 2023 —– 42.04 లక్షల కోట్లు ——– రూ.3.75 లక్షల కోట్లు