హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): అనుమతుల్లేని ప్రీ లాంచింగ్లతోపాటు నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రాజెక్టులకు నోటీసులు జారీచేసి, రూ.21 కోట్ల మేరకు ఫైన్ వేసినట్టు రెరా కార్యదర్శి పీ యాదిరెడ్డి తెలిపారు. అలాగే బిల్డాక్స్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుపై ఫిర్యాదులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.
ఇప్పటికే రెరా ట్రిబ్యునల్ పరిధిలో విచారణ జరిపామని, గురువారం మరోసారి విచారిస్తామని స్పష్టం చేశారు. ఇదిలావుంటే ఇప్పటివరకు రెరాలో రిజిస్ట్రేషన్ కోసం 9,217 ప్రాజెక్టులు దరఖాస్తు చేసుకోగా, 8,003 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక 3,765 మంది ఏజెంట్లు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా, 3,621 మందికి అనుమతిచ్చారు.