Ban on IT Products | విదేశాల నుంచి లాప్టాప్లు, కంప్యూటర్లు, టాబ్లెట్ల దిగుమతిపై గ్లోబల్ టెక్ దిగ్గజాలకు రిలీఫ్ కల్పించింది. 2024 సెప్టెంబర్ నెలాఖరు వరకూ వాటి దిగుమతికి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆపిల్, డెల్, ఇంటెల్, శాంసంగ్, అసుస్ వంటి సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది.
విదేశాల నుంచి లాప్టాప్లు, కంప్యూటర్లు, టాబ్లెట్ల దిగుమతిపై నియంత్రణ కోసం విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్టీ).. దిగుమతి యాజమాన్య వ్యవస్థ అనే పేరుతో కొత్త పోర్టల్ డిజైన్ చేస్తున్నది. విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకునే కంపెనీలు తమ పేర్లు నమోదు చేసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకునే వస్తువుల డేటా.. ఈ పోర్టల్లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. 2024 సెప్టెంబర్ తర్వాత పరిస్థితులను కేంద్రం సమీక్షించడంతోపాటు దిగుమతి వస్తువులపై సుంకాలు తగ్గించే విషయాన్ని పరిశీలిస్తుంది.
గత నెల మూడో తేదీన భద్రతా కారణాలతో విదేశాల నుంచి లాప్టాప్లు, కంప్యూటర్లు, టాబ్లెట్ల దిగుమతిపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక నుంచి వీటిని దిగుమతి చేసుకోతలపెట్టిన కంపెనీలు.. లైసెన్సులు పొందాల్సి ఉంటుందని కేంద్రం తేల్చేసింది. కేంద్రం నిర్ణయం వల్ల తలెత్తే పరిణామాలపై ఐటీ, హార్డ్వేర్ కంపెనీల ప్రతినిధులు.. కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో శాంసంగ్, డెల్, ఇంటెల్, అసుస్, ఎసేర్, ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేసన్ (ఐసీఈఏ), మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మైట్) ప్రతినిధులు పాల్గొన్నారు.
విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న లాప్టాప్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లకు దేశీయ కంపెనీలు ప్రస్తుతం 8-10 శాతం విడి భాగాలు సరఫరా చేస్తున్నాయి. వచ్చే మూడేండ్లలో వీటి విడి భాగాల తయారీ 65-70 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. డిజిటల్ ఎకో సిస్టమ్ కోసం విదేశాల నుంచి 80 శాతం లాప్టాప్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు దిగుమతి చేసుకోవచ్చునని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.