Gold Rates | మొన్నమొన్నటి వరకు పైపైకి దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు కాస్త రిలీఫ్ ఇచ్చాయి. అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, డాలర్ విలువే దీనికి కారణం అని తెలుస్తున్నది. వచ్చే నెలలో పెండ్లిండ్ల ముహూర్తాలు లేకపోవడం కూడా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి, వెండికి గిరాకీ తగ్గిందని జ్యువెల్లరీ వ్యాపారులు అంటున్నారు. బంగారం ధర పెరిగిపోవడంతో, పాత నగల స్థానే కొత్త ఆభరణాల కొనుగోలు పెరుగుతున్నదని ఇటీవల ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధరలు ఇంకా తగ్గుతాయా.. లేదా అని పలువురు వేచి చూస్తున్నారు. గత నెలతో పోలిస్తే తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.5000 వరకూ తగ్గి వచ్చింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధర గరిష్టానికి దూసుకెళ్లడంతో భారతీయ మహిళల్లో పుత్తడి పట్ల మోజు తగ్గినట్లు కనిపిస్తున్నది. పెండ్లయినా, ఏ ఇతర వేడుకైనా కొత్త ఆభరణాలు కొనుగోలు చేయడానికి మహిళలు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ధరలు పెరిగిపోవడంతో బంగారం కొనుగోళ్లు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తున్నది.
అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో ప్రతి ఒక్కరికీ బంగారం, వెండి పెట్టుబడి ఆప్షన్గానే కనిపిస్తుంది. మనదేశంలో స్టాక్ మార్కెట్లో స్టాక్స్పై ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు ఇతర దేశాల్లో ఇన్వెస్టర్లు బంగారం, వెండి ఫ్యూచర్ కాంట్రాక్టులు కొని, లాభాలకు విక్రయిస్తుంటారు. కానీ, భారత్తోపాటు చైనాలో మాత్రమే బంగారం, ఆభరణాల రూపాల్లో కొనుగోలు చేస్తారు.
గతేడాది మార్చిలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2052 డాలర్లు పలికింది. ఇప్పుడు 1815 డాలర్లకు లభిస్తున్నది. ఔన్స్ బంగారం అంటే 31.10 గ్రాములు అన్నమాట. గతేడాది ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.76 అయితే, ఇప్పుడు రూ.82లకు పతనమైంది.
గత నెలలో ఔన్స్ బంగారం ధర 1952 డాలర్లయితే, దేశీయ మార్కెట్లో24 క్యారట్ల తులం బంగారం (పది గ్రాములు) రూ.60,900 మార్క్కు వరకూ దూసుకెళ్లింది. గత నెలతో పోలిస్తే ఔన్స్ బంగారం ధర 137 డాలర్లు పతనమైంది. దేశీయంగా బులియన్ మార్కెట్లో పది గ్రాముల (24 క్యారట్లు) బంగారం ధర శుక్రవారం ఢిల్లీలో తులం బంగారం ధర రూ.55,025లకు పడిపోయింది. అంటే రూ.5000 వరకు ధర తగ్గినట్లు కనిపిస్తున్నది. కిలో వెండి ధర కూడా రూ.72 వేల నుంచి రూ.63500లకు పడిపోయింది. అంటే రూ.8500 తగ్గిందన్నమాట.
గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.80 తగ్గి రూ.55,025లకు పడిపోయింది. బుధవారం బులియన్ మార్కెట్లో రూ.55,105 వద్ద క్లోజయింది. కిలో వెండి ధర సైతం రూ.390 పతనమై రూ.61,955లకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 20.02 డాలర్లు పతనమై 1,815 డాలర్ల వద్ద స్థిర పడింది. అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచుతుందన్న భయాలు మార్కెట్ వర్గాలను వెంటాడుతున్నాయని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శ్రీరామ్ అయ్యర్ చెప్పారు.
కార్పొరేట్ సంస్థలేవీ బిల్లుల్లేకుండా బంగారం విక్రయాలు జరుపవు. స్థానిక దుకాణాలు మాత్రమే బిల్లు లేకుండానే ఆభరణాలు విక్రయిస్తుంటారు. అలా చేయడం వల్ల మూడు శాతం జీఎస్టీ తగ్గుతుంది. సుమారు రూ.లక్ష కొనుగోలు చేస్తే రూ.3000 ఆదా అవుతుంది. కానీ, ఆ బంగారం ఆభరణాల స్వచ్ఛతకు గ్యారంటీ ఉండదు. ఏ బంగారం వ్యాపారి దగ్గర కొనుగోలు చేసినా దాని స్వచ్ఛతను క్యారెట్ల మీటర్పై చెక్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మున్ముందు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్పై మరో 50 డాలర్ల వరకు తగ్గొచ్చునని బులియన్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అందువల్ల దేశీయ మార్కెట్లో బంగారం ధర మరింత దిగి వస్తుందని భావిస్తున్నారు.